కొమురవెల్లి మల్లన్న ఆలయ ధర్మకర్తల
మండలి నియామకానికి నోటిఫికేషన్
విడుదల చేసిన దేవాదాయశాఖ కమిషనర్
దరఖాస్తులకు 20 రోజుల గడువు
చేర్యాల, జూన్ 4 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తులకు 20రోజుల పాటు గడువు విధించారు. ప్రస్తుత ధర్మకర్తల మండలి పదవీ కాలం మే 19న ముగియగా, కొత్త కమిటీ నియామకం కోసం అనుమతి ఇవ్వాలని సర్కారుకు నివేదిక పంపించారు. నివేదికను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పాలక మండలి నియమించుకోవాలని దేవాదాయశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు నోటీసు ఈ నెల 24 వరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం 30/87లో గల 17(3) నిబంధనల్లో పేర్కొబడిన నమూనా ఫారం(2) ద్వారా కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ, సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్ హైదరాబాద్/సహాయ కమిషనర్ మెదక్ జిల్లా, సంగారెడ్డి, సంబంధిత దేవాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చని నోటిఫికేషన్లో కమిషనర్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల పూర్తి సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు సైతం విచారణ సాగిస్తారు. ధర్మకర్తలుగా దరఖాస్తు చేసుకున్న వారిపై కేసులు ఉంటే అనర్హులవుతారు.
కొత్త కమిటీ.. పాత కమిటీయా?
కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా అధికార పార్టీ నాయకులను స్వామివారి ఆలయానికి ధర్మకర్తల మండలి నియమించడం ఆనవాయితీ. గతంలో ఉన్న కమిటీ పదవీకాలం ముగియడం, ధర్మకర్తల మండలి నియామకం కోసం నోటిఫికేషన్ రావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, పాత కమిటీని తిరిగి నియమిస్తారని, లేదు కొత్త కమిటీని సర్కారు ఏర్పాటు చేస్తుందనే చర్చ స్వామివారి క్షేత్రంతో పాటు వివిధ వర్గాల్లో కొనసాగుతున్నది.