చేర్యాల, జూన్ 25 : సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో రెండేండ్లుగా కొనసాగుతున్న 365(బి) జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు పనులు ముగియకముందే నిర్మాణాలు కూలిపోతుండడంతో పాటు కుంగిపోతుండడంతో పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 365(బి)సూర్యాపేట-దుద్దెడ క్రాస్ రోడ్డు వరకు రూ.300 కోట్లతో చేపట్టిన జాతీయ రహదారి పనులు నత్తనడకన కొనసాగడమే కాకుండా నాసిరకంగా చేపడుతున్నారు.
చేర్యాల తహసీల్ కార్యాలయం మొదలుకుని ఐవోసీ పెట్రోల్ పంపు వరకు జాతీయ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించి, దానిపై స్లాబ్ వేశారు.అనంతరం అదే డ్రైనేజీ పై పుట్పాత్ నిర్మాణ పనులు చేపట్టారు.కాగా, చేర్యాల పట్టణంలో సుమారు మూడు కిలోమీటర్ల మేర చేపట్టిన పుట్పాత్ అందంగా కనిపించేందుకు, పాదచారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిచేందుకు వీలుగా టైల్స్ వేస్తున్నారు. పుట్పాతపై వేస్తున్న టైల్స్లో నాణ్యత కరువైంది. పుట్పాత్ పై వేసిన రెండో రోజునే బిచ్చలు,బిచ్చలుగా టైల్స్ పగిలిపోతుండడంతో పట్టణవాసులు పెదవి విరుస్తున్నారు.
జాతీయ రహదారి పనులు ప్రారంభించినప్పటి నుంచి పట్టణంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీనికి తోడుగా కాంట్రాక్టర్ పనులు ఏండ్లుగా చేపడుతున్నాడు. నాణ్యత లేకుండా పనుల చేపడుతున్నాడు. రోడ్డు విస్తరణ విషయంలో సైతం కొన్ని ప్రదేశాల్లోని షాపుల వద్ద ఒక విధంగా, మరికొన్ని షాపుల వద్ద మరో రకంగా చేపట్టారు. వారి నుంచి డబ్బులు తీసుకుని రోడ్డు విస్తరించారని పట్టణంలో చర్చనీయాశంగా మారింది. హైవేస్ అథారిటీ ఆఫ్ ఉన్నతాధికారులు చేర్యాలలో జరుగుతున్న రోడ్డు విస్తరణ, పుట్పాత్ నిర్మాణం, దాని పై వేసిన టైల్స్ తదితర పనులు నాణ్యతపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.