నేడు దుబ్బాకలో అభివృద్ధి పనులకు అంకురార్పణ
దుబ్బాక, డిసెంబర్ 29 : సీఎం కేసీఆర్ మమకారం.. మంత్రి హరీశ్రావు సహకారం.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక చొరవతో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను సింగారించుకుంది. శుక్రవారం దుబ్బాక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజు కానున్నది. రూ.17.50కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరుగనుండగా, రూ.12.5 కోట్ల పనులకు శంకుస్థాపన జరుగనున్నది. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు, ఆర్టీసీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఆర్అండ్బీ (రోడ్డు భవనాలు) శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
వీరితో పాటు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా, ఇంత పెద్దమొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుండగా, దుబ్బాకలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు అటు అధికారులు, ఇటు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి నేతృత్వంలో శుక్రవారం దుబ్బాకలో రూ.30 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రుల చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు.
మొదట మోడల్ బస్టాండ్..
ఎప్పుడెప్పుడా అని దుబ్బాక ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోడల్ బస్టాండ్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. విద్యాబుద్ధులు నేర్పిన దుబ్బాక గడ్డపై సీఎం కేసీఆర్కు ఎనలేని అభిమానం ఉంది. దుబ్బాకలో విద్యాభ్యాసం, బాల్య స్మృతులను సీఎం తరచూ తన మిత్రులతో గుర్తు చేసుకుంటారు. తెలంగాణ ఉద్యమంతో పాటు మరెన్నో ఉద్యమాలకు కేంద్రబిందువుగా నిలిచిన దుబ్బాక అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సహకారం, మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక కృషితో దుబ్బాక అభివృద్ధి జోరందుకున్నది. గత ఉప ఎన్నికల హామీ మేరకు దుబ్బాకలో శిథిలావస్థలో ఉన్న బస్టాండ్ను తొలిగించి, రూ.3.50కోట్లతో సర్వాంగ సుందరంగా మోడల్ బస్టాండ్ నిర్మించారు. దీనిని శుక్రవారం ఉదయం 11గంటలకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభిస్తారు. మంత్రి హరీశ్రావు సహకారం, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కృషి మూలంగా సీఎం కేసీఆర్ దుబ్బాక బస్టాండ్కు కావాల్సిన నిధులు మంజూరు చేశారు. కేవలం ఏడాదికాలంలో సకలహంగులతో బస్టాండ్ భవనాన్ని నిర్మించారు.
ఆర్అండ్బీ రోడ్డు పనులకు శంకుస్థాపన
సిద్దిపేట-రాజన్న సిరిసిల్ల జిల్లాల అనుసంధానమైన ప్రధాన రహదారుల్లో దుబ్బాక-ముస్తాబాద్ రోడ్డు ఒకటి. ఈ రోడ్డు సింగిల్ రోడ్డుగా ఉండటంతో ప్రయాణికులకు ఇబ్చందికరంగా మారింది. ఈ విషయంపై స్పందించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయించారు. దుబ్బాక -ముస్తాబాద్ రోడ్డులో(దుబ్బాక అంబేద్కర్ చౌరస్తా నుంచి మోహినికుంట చౌరస్తా వరకు) 8.38 కి.మీ దూరంలో డబుల్ రోడ్డు విస్తరణ పనులకు రూ.12 కోట్లు మంజూరయ్యాయి. ఈ రోడ్డు విస్తరణ పనులకు ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
పోతారంలో అభివృద్ధి కార్యక్రమాలు
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి స్వగ్రామమైన పోతారంలో రూ.6కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు హాజరవుతున్నారు. గ్రామంలో రూ.3.65 కోట్లతో నిర్మించిన 73 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించనున్నారు. అలాగే, రూ.1.20 కోట్లతో నిర్మించిన విద్యుత్
సబ్స్టేషన్, రూ.30 లక్షలతో రెడ్డి సంఘం భవనం, ఇండ్లు, రూ.45 లక్షలతో గోదాం, రూ.20 లక్షలతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4 అదనపు తరగతి గదులు, రూ.12 లక్షలతో నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రులు ప్రారంభిస్తారు. గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షలు మంజూరు కాగా, వీటిన్నింటిని మంత్రులు, ఎంపీ ప్రభాకర్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు.
మార్కెట్ యార్డులో బహిరంగ సభ
దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు ఏఎంసీ నూతనపాలకవర్గం ఆధ్వర్యంలో బహిరంగ సభ(ఏఎంసీ నూతన పాలకవర్గం కృతజ్ఞతా సభ)ను నిర్వహించనున్నారు. గురువారం దుబ్బాకలో ఏఎంసీ చైర్పర్సన్ చింతల జ్యోతి, వైస్చైర్మన్ పద్మయ్యతో పాటు 18మంది సభ్యులు పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు వస్తున్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతా సభ నిర్వహిస్తున్నట్లు పాలకవర్గం తెలిపింది. ఈ సభలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. సభ అనంతరం శ్రేణులకు భోజన వసతి కల్పించారు. అక్కడి నుంచి ఎంపీ ప్రభాకర్రెడ్డి స్వగ్రామం పోతారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు వెళ్తారు.
హబ్షీపూర్లో వ్యవసాయ గిడ్డంగులు
దుబ్బాక మండలంలో హబ్షీపూర్ శివారులో రూ.8కోట్లతో రెండు అధునాతన వ్యవసాయ గిడ్డంగులు నిర్మించారు. ఒక్కో గిడ్డంగి సామర్థ్యం 5 వేల మెట్రిక్ టన్నులు ఉంటుంది. గిడ్డంగులతో పాటు కార్యాలయ భవనం, అంతర్గత సీసీ రోడ్డు, ప్రహరీ, నిర్మించారు. వ్యవసాయ గిడ్డంగులను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభిస్తారు.
భారీ బైక్ ర్యాలీ
దుబ్బాకలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వస్తున్న మంత్రులు, ముఖ్యఅతిథులకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు, ప్రజా
ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. దుబ్బాక మండలం హబ్షీపూర్ నుంచి దుబ్బాక వరకు 5 కి.మీ దూరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.