రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని రోడ్లకు మహర్దశ పట్టింది. మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి-765డీజీ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.ఈ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరగా చేపట్టాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, హైదరాబాద్లో పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా.. ప్రమాదాలు చోటుచేసుకోకుండా.. భవిష్యత్తులో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అత్యాధునికంగా ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ రోడ్డు పనులు పూర్తయితే మెదక్, సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ, వరంగల్ తదితర జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరనున్నది. ప్రయాణం మరింత మెరుగుపడనున్నది.
సిద్దిపేట, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని రోడ్లకు మహర్దశ వచ్చింది. జాతీయ రహదారుల నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతున్నది. ఇప్పటికే వివిధ రంగాల్లో అగ్రభాగాన నిలిచిన జిల్లా నేడు జాతీయ రహదారులతో మరిన్ని పరిశ్రమలు రానున్నాయి. ప్రయాణం మరింత మెరుగుపడనున్నది.
మెదక్- సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి (765 డీజీ) పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. టెండర్లు, అగ్రిమెంట్ తదితర పనులు పూర్తి చేసి జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. మెదక్ -సిద్దిపేట ఒక బిట్టుగా, సిద్దిపేట- ఎల్కతుర్తి వరకు రెండో బిట్టుగా రహదారిని విభజించారు. సిద్దిపేట- ఎల్కతుర్తి 63.641 కిలో మీటర్ల రహదారికి రూ. 578.85 కోట్లు, మెదక్ నుంచి సిద్దిపేట వరకు రహదారి విస్తరణకు 70 కిలో మీటర్లకు గాను ప్రభుత్వం రూ. 882 కోట్లు మంజూరు చేసింది. ఈ జాతీయ రహదారి 765 డీజీ 134 కిలోమీటర్లు విస్తరించి ఉండనుంది.
ఇందులో రెండు టోల్ ప్లాజాలు వస్తాయి. ఒకటి పోతారెడ్డి పేట నుంచి నిజాంపేట మధ్యలో, రెండోవది పందిల్ల వద్ద టోల్ ప్లాజా వస్తుంది. ఈ రహదారి విస్తరణతో మెదక్, సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ, వరంగల్ తదితర జిల్లాలకు అనుసంధానంగా ఉంటుంది. కాగా, జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరగా చేపట్టాలని పలుమార్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, హైదరాబాద్లో సమీక్షా సమావేశాలు నిర్వహించి జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. ఈ రహదారి నిర్మాణ పనుల్లో రోడ్డు భవనాలు, తాగు నీటి సరఫరా అధికారులు, విద్యుత్, రెవెన్యూ, రైల్వేశాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.
రహదారి నిర్మాణం కోసం అటవీశాఖ అభ్యంతరాలను క్లియరెన్స్ చేయడంతో పాటు కావాల్సిన భూసేకరణ త్వరగా చేపట్టాలని, రహదారి మీదుగా ఉన్న ఇరిగేషన్ కాల్వలు , క్రాసింగ్స్ వస్తున్న నేపథ్యంలో వాటిలో జాతీయ, నీటిపారుదలశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారి విస్తరణ పనులకు కావాల్సిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని సిద్దిపేట, మెదక్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మెదక్ జిల్లాలో 26.82 హెక్టార్లు, సిద్దిపేట జిల్లాలో 18.25 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉంది. దీంతో అధికారులు ఆదిశగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్నారు.
జాతీయ రహదారితో ఈ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందనున్నది. ఇప్పటికే కాళేశ్వరం జలాలు వచ్చి చేరాయి. గోదావరి జలాలతో ఈ ప్రాంతంలో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి. త్వరలోనే సిద్దిపేట జిల్లా ప్రజలకు రైల్వే కల సాకారం కానున్నది. ఇప్పటికే గజ్వేల్ వరకు ఎరువుల కోచ్ వస్తున్నది. ఎరువుల రేక్ పాయింట్ను ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాల పునర్విభజనతో నలుమూలల అభివృద్ధి పరుగులు పెడుతున్నది.
మెదక్ నుంచి సిద్దిపేట వరకు 69.97 కిలోమీటర్లు
మెదక్ నుంచి సిద్దిపేట వరకు రూ.882.18 కోట్లతో 69.97 కిలోమీటర్ల రోడ్డును విస్తరిస్తారు. ఈ జాతీయ రహదారికి సంబంధించి రీచ్-1, 2లుగా పనులు చేపడుతున్నారు. రీచ్ వన్గా సిద్దిపేట జిల్లాలోని పోతిరెడ్డిపేట నుంచి రంగధాంపల్లి బ్రిడ్జి వరకు, రీచ్ -2 పనులు మెదక్ పట్టణం నుంచి నిజాంపేట వరకు విభజించారు. ఈ రహదారి మెదక్ జిల్లాలో 33.67 కిలోమీటర్లు, సిద్దిపేట జిల్లాలో 36.302 కిలోమీటర్లు రోడ్డు విస్తరించి ఉంటుంది. మెదక్ జిల్లాలో మెదక్ టౌన్, పాతూరు, అక్కన్నపేట, రామాయంపేట, కోనాపూర్, నందిగామ, నిజాంపేట, సిద్దిపేట జిల్లాలో పోతిరెడ్డి పేట, అక్బర్పేట, చిట్టాపూర్, హబ్సిపూర్, ధర్మారం, తిమ్మాపూర్, ఇర్కోడు, బూరుగుపల్లి గ్రామాలతో పాటు సిద్దిపేట పట్టణ పరిధిలో నాలుగు వరుసల రహదారిగా విస్తరిస్తారు.
జాతీయ రహదారి సాగే గ్రామాల వెంట ఫోర్లైన్ రోడ్డు, స్ట్రీట్ లైట్లు, ఇరువైపులా ప్రమాదాలు జరుగకుండా రేలింగ్, ఇరువైపులా వర్షపు నీరు నిల్వకుండా సైడ్ డ్రైన్లు, పుట్పాత్లు నిర్మిస్తారు. సిద్దిపేట టౌన్లో ఎన్సాన్ పల్లి జంక్షన్ నుంచి రంగధాంపల్లి బ్రిడ్జి వరకు రెండు వరుసల రోడ్డుతో పాటు ఇరువైపులా స్థానిక ప్రజల సౌకర్యార్థం సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తారు. ఎన్సాన్ పల్లి సర్కిల్ వద్ద వెహికల్ అండర్ పాస్, సిద్దిపేటలో హైదరాబాద్-కరీంనగర్ రోడ్డు వద్ద వెహికల్ ఓవర్ పాస్ నిర్మించనున్నారు. మెదక్ రామాయంపేట ఎన్హెచ్ -44ను క్రాస్ చేసేందుకు వెహికల్ అండర్ పాస్, గజ్వేల్ రోడ్డులో రామాయంపేట సమీపంలో మరో వెహికల్ అండర్ పాస్ నిర్మిస్తారు. అక్కన్నపేట వద్ద రైల్వే ట్రాక్ ఉండడంతో అక్కడ వాహనాలు పోయేందుకు రైల్ అండర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో సిద్దిపేటలో 4 మేజర్ జంక్షన్లు, 19 మైనర్ జంక్షన్లు, మెదక్ జిల్లాలో 4 మేజర్ జంక్షన్లు, 15 మైనర్ జంక్షన్లు అభివృద్ధి చేస్తారు. కాగా రామాయంపేటలో 2.65 కిలోమీటర్లు బైపాస్ రోడ్డు రానున్నది.. నాలుగు వరుసల రహదారి రావడం వల్ల గ్రామాల రూపురేఖలు మారనున్నాయి.
సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు 63 కిలోమీటర్లు
సిద్దిపేట రంగధాంపల్లి బ్రిడ్జి నుంచి హుస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇటీవల మంత్రి హరీశ్రావు ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. సిద్దిపేట రంగధాంపల్లి నుంచి ఎల్కతుర్తి వరకు 63 కిలో మీటర్లు రోడ్డు విస్తరించి ఉంటుంది. ఇందుకు రూ. 578.85 కోట్లు కేటాయించింది. ప్రధానంగా ఈ రహదారి రంగధాంపల్లి బ్రిడ్జి నుంచి ప్రారంభమై మిట్టపల్లి, ముండ్రాయి, పాలమాకుల, బద్దిపడగ, బస్వాపూర్, సముద్రాల, పందిల్ల, హుస్నాబాద్, పోతారం(ఎస్) జిల్లెల గడ్డ, ముల్కనూరు, కొత్తపల్లి, ఇంద్రనగర్, ఎల్కతుర్తి గ్రామాలు మీదుగా హన్మకొండ- కరీంనగర్ జాతీయ రహదారికి కలుస్తుంది. ఈరహదారి విస్తరణలో భాగంగా పెద్ద బ్రిడ్జిలు (2) బస్వాపూర్, పందిల్ల, మైనర్ బ్రిడ్జిలు 26, పైప్కల్వర్టులు 29, స్లాబ్ కల్వర్టులు 29 ఉన్నాయి. హుస్నాబాద్ పక్కన ఉన్న పందిల్ల వద్ద టోల్ప్లాజా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఎనిమిది వరుసల రహదారి నిర్మించి 7 టోల్ బూత్లను ఏర్పాటు చేస్తారు. అవసరమైన చోట ఆర్సీసీ డ్రైన్స్ 12 చోట్ల 25.738 కిలోమీటర్లు, సోర్ డ్రైన్స్ 20 చోట్ల 14.72 కిలోమీటర్లు ఉండనున్నది.