మనోహరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ మాదిరిగా దేశాన్ని సైతం అభివృద్ధి పథంలో నడిపేందుకు సీఎం కేసీఆర్ నడుంబిగించారని జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్గౌడ్, మాజీ చైర్మన్లు ఎలక్షన్రెడ్డి, భూంరెడ్డి తెలిపారు. మనోహరాబాద్ మండలం వెంకటాపూర్ అగ్రహారంలో వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో భారత రాష్ట్ర సమితి పార్టీని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు. మోడీ ప్రభుత్వం ఓ నియంత పాలనగా మారిందని, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటున్నదని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశం నష్టాల బాటపట్టిందన్నారు.
పంచాయతీ భవన నిర్మాణం పరిశీలన
సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్గౌడ్ తెలిపారు. వెంకటాపూర్ అగ్రహారంలో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న పంచాయతీ, మహిళా భవనాలను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న పనుల వివరాలు, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్గౌడ్, సర్పంచ్ రేణుకా ఆంజనేయులు, ఉప సర్పంచ్ ఆంజనేయులు, తుమ్మల రాజుయాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు నీలగిరిగౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.