జహీరాబాద్, జనవరి 14: చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తించిన ప్రపంచ దేశాలు, వాటిని సాగుచేసే రైతులను ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నాయని జాతీయ చిరుధాన్యాల పరిశోధన కేంద్రం(ఇండియన్ ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్స్) హైదరాబాద్ శాస్త్రవేత్త ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సంజనరెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాంగార్బోడి తండాలో శనివారం ‘డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళా సంఘాలు-పస్తాపూర్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 23వ జీవ వైవిధ్య పాత పంటల జాతరలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిరుధాన్యాలకు పుట్టినిల్లు భారతదేశం అన్నారు. సజ్జలు ఆఫ్రికా నుంచి మనదేశానికి వచ్చినట్లు చెప్పారు. బ్రిటిష్ వారి రెండు శతాబ్దాల పాలనలో మనదేశంలో రెండుసార్లు తీవ్ర కరువు రావడంతో విదేశాలకు చెందిన పంటలైన వరి, గోధుమ సాగును మనవద్ద ప్రవేశపెట్టారన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచి ఆహార కొరత లేకుండా చేసేందుకు వరి, గోధుమ సాగును అప్పట్లో ప్రోత్సహించినట్లు తెలిపారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ దేశంలో కొనసాగుతున్నదన్నారు. మన రైతుల కష్టంతో కరోనా సమయంలో దేశంలో ఆహార కొరత ఏర్పడలేదని శాస్త్రవేత్త డాక్టర్ పి.సంజనరెడ్డి తెలిపారు. మనదేశం నుంచి విదేశాలకు ఆహార ఉత్పత్తులు, ప్రధానంగా ధాన్యం ఎగుమతి చేసినట్లు చెప్పారు.సంప్రదాయ పంటల సాగును పెంచేందుకు భారత ప్రభుత్వం 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందన్నారు.
చిరుధాన్యాల్లో వైవిధ్యం..
శాస్త్రవేత్త డాక్టర్ పి.సంజనరెడ్డి మాట్లాడుతూ… చిరుధాన్యాల్లో వైవిధ్యం ఉందని, చిరుధాన్యాలు సాగుచేస్తున్న రైతులు ఎక్కడా ఆత్మహత్య చేసుకున్నట్లు వార్త వినలేదన్నారు. అదే పత్తి పంట సాగుచేస్తున్న రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు వార్తల్లో వింటున్నామన్నారు. భావితరాలకు చిరుధాన్యాలను అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు. అధిక దిగుబడులు సాధించడం ఎంత ముఖ్యమో పంట ఉత్పత్తిలో నాణ్యతా అంతే ప్రధానమన్నారు. వ్యవసాయ పనుల్లో కష్టం ఉన్నా ప్రపంచానికి తిండి పెడుతున్నామన్న తృప్తి, సంతోషం రైతుల్లో ఉంటుందన్నారు. చిరుధాన్యాలు సేంద్రియ విధానంలో సాగుచేయాలని సూచించారు. సేంద్రియ పద్ధ్దతిలో పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని రైతులను కోరారు. వాతావరణ మార్పులతో వ్యవసాయరంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
చిరుధాన్యాలను ప్రపంచం గుర్తించడం సంతోషకరం
జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు సేంద్రియ ఎరువులతో చిరుధాన్యాలు సాగుచేసేలా పేద మహిళా రైతులను చైతన్యం చేసేందుకు కృషిచేస్తున్నామని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) డైరెక్టర్ పీవీ సతీశ్ అన్నారు. ప్రారంభంలో పాత పంటల జాతరను రెండు మూడేండ్లు నిర్వహించాలని అనుకున్నామన్నారు. కానీ, అందరి సహకారంతో 23వ సారి విజయవంతంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ జాతర విజయవంతంలో గిరిజన మహిళల కృషి ఎనలేనిదన్నారు. జీవ వైవిధ్య ఉత్సవంగా ఏటా ఈ జాతరను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జీవ వైవిధ్యం కాపాడేందుకు శాస్త్రవేత్తలు ల్యాబ్ల్లో పరిశోధనలు చేస్తారన్నారు. పేద మహిళలు వ్యవసాయ భూముల్లో పంటలు పండిస్తూ జీవవైవిధ్య పరిరక్షణకు కృషిచేస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో పంటల సాగును పరిశీలించి సంప్రదాయ సాగును ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రతి ఊరిలో దేవుళ్ల పేరుతో జాతర నిర్వహిస్తారని, ఇక్కడ మాత్రం పాత పంటలతో జాతర నిర్వహించి రైతులను చైతన్యం చేస్తున్నట్లు చెప్పారు. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి, పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకుంటారన్నారు. కానీ, రైతులు పొలంలో పంటలు సాగుచేసి అనుభవాన్ని పొందుతారన్నారు. ఇక్కడి మహిళలు పెద్దగా చదువుకోలేదని, కానీ.. చిరుధాన్యాల సాగులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినట్లు చెప్పారు. గతంలో జొన్నలు పేదలు తినే ఆహారంగా భావించేవారని, కానీ..ఇప్పుడు జొన్నలు ధనికులు తినే ఆహారంగా మారిపోయిందన్నారు. ప్రపంచంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యత పెరిగిపోయిందని, డీడీఎస్ మహిళలు చూపిన మార్గంలో ప్రపంచ దేశాలు నడుస్తున్నాయని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) డైరెక్టర్ పీవీ సతీశ్ తెలిపారు.
అనారోగ్యం బారిన నగర ప్రజలు
పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న వారికి అక్కడి కాలుష్యం, ఉరుకులు పరుగులు జీవనం, ఆహారపు అలవాట్లు, జీవనశైలితో ఎక్కువగా రోగాల బారిన పడుతున్నట్లు శాస్త్రవేత్త డాక్టర్ పి.సంజనరెడ్డి చెప్పారు.
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) మహిళలు 23ఏండ్లుగా నిర్వహిస్తున్న పాత పంటల జాతరను చూసి ప్రపంచ దేశాలు ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి (యూఎన్) 2023ను చిరుధాన్యాల ఏడాదిగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.
అట్టహాసంగా ప్రారంభమైన జీవవైవిధ్య పండుగ…
చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు చిరుధాన్యాల్లో ఉన్న పోషకాలు, వాటి గొప్పతనాన్ని తెలియజేసేందుకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) మహిళలు జాంగార్బోడి తండాలో జీవవైవిధ్య పండుగ(పాత పంటల జాతర)ను శనివారం ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్లోని చిరుధాన్యాల పరిశోధన కేంద్రం ప్రిన్సిపాల్, శాస్త్రవేత్త డాక్టర్ సంజనరెడ్డి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రైతులకు సన్మానం
చిరుధాన్యాలు సాగుచేస్తున్న మహిళలు రైతులు మరియమ్మ (న్యాల్కల్ మండలం శంశోల్లాపూర్), బ్యాగరి రంగమ్మ(కోహీర్ మండలం గోటిగార్పల్లి), జంగమ్మ (మొగుడంపల్లి మండలం జాంగార్బోడి తండా), జాంగార్బోడి తండాకు చెందిన చౌహాన్ సుధాబాయి, లచ్చనాయక్ తండాకు చెందిన జ్యోతిబాయి చిరుధాన్యాల గొప్పతనం గురించి తెలియజేశారు. పశువుల ఎరువులతో పది రకాల చిరుధాన్యాల సాగుచేసి ఆహారంగా, పశువులకు మేతగా వినియోగిస్తున్నట్లు వారు చెప్పారు. తడి గింజలతో పాటు కూరగాయలు పండిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జాంగార్బోడి తండాకు చెందిన మహిళా రైతు చౌహాన్ సుధాబాయి, లచ్చనాయక్ తండాకు చెందిన జ్యోతిబాయిని ఉత్తమ రైతులుగా గుర్తించి సన్మానం చేశారు. వీరితో పాటు పలువురు మహిళా రైతులను సన్మానం చేశారు. ఎడ్లబండ్లకు పూజలు చేసి జాతరను డాక్టర్ సంజనరెడ్డి ప్రారంభించారు. కళాకారులు, మహిళలు ఆటపాటలతో చిరుధాన్యాలపై ప్రదర్శనలు ఇచ్చారు. మహిళలు చిరుధాన్యాలపై పాటలు పడి అందరినీ ఆకట్టుకున్నారు. చిరుధాన్యాల పంటలు, మట్టి రకాలు, ఆకుల ప్రాధాన్యతను వివరించే ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ రమేశ్రెడ్డి, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దగడే సురేశ్, జాంగార్బోడి తండా బీఆర్ఎస్ నాయకులు రాంశెట్టి, విటునాయక్ తండా బీఆర్ఎస్ నాయకులు చందర్, డీడీఎస్ మహిళలు చంద్రమ్మ, లక్ష్మమ్మ, జయశ్రీ, కేవీకే వ్యవసాయ శాస్త్రవేత్తలు, మహిళా రైతులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విదేశీ విద్యార్థులు పాల్గొన్నారు.