శివ్వంపేట, నవంబర్ 16: సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి గెలుపు కోసం సీఎం కేసీఆర్ గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నర్సాపూర్ పట్టణంలోని వెల్దుర్తి రోడ్డు మార్గంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు నియోజకవర్గంలోని నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, వెల్దుర్తి, హత్నూర, చిలిపిచెడ్, మాసాయిపేట, కొల్చారం మండలాల నుంచి 50వేల పైనే జనం, బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. సభలో కళాకారులు పాడిన ‘గులాబీల జెండలే రామక్క’ పాటకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి కాసేపు కాలు కదిపి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలను ఉత్సాహపరిచారు.
నర్సాపూర్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఇర్ఫాన్ అలీ బీఆర్ఎస్ జెండాతో క్రేన్ పైకి ఎక్కి జై తెలంగాణ అంటూ నినాదాలు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం కేసీఆర్ హెలిక్యాప్టర్తో సభా ప్రాంగణాన్ని చుట్టేయగా.. బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు జైతెలంగాణ, జైబీఆర్ఎస్ అంటూ నినాదాలతో సభ మార్మోగింది. సీఎం కేసీఆర్ హెలిక్యాప్టర్ సరిగ్గా 5.32 గంటలకు ల్యాండ్ అయ్యింది. అక్కడి నుంచి బస్సులో సభా ప్రాంగణానికి 5.39 గంటలకు చేరుకొని, 5.45 గంటలకు స్టేజీ పైకి వచ్చారు. 5.48 గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రారంభించి 6.21 గంటలకు ముగించారు. సీఎం కేసీఆర్ ప్రసంగం దాదాపు 24 నిమిషాలు సాగింది. అనంతరం కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులకు బీఆర్ఎస్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.