రామాయంపేట, మార్చి 10 : తల్లిదండ్రి లేని ఆడబిడ్డలను ఆర్థికంగా ఆదుకుంటానని మైనంపల్లి ట్రస్టు నిర్వాహకుడు మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం నార్సింగి మండలంలోని సంకాపూర్, సంకాపూర్ తండాను సందర్శించి, అనాథ ఆడబిడ్డలకు రూ.25 వేల చొప్పున పోస్టల్ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మొదటి విడతగా మెదక్ నియోజకవర్గంలోని చిన్నశంకరంపేట మండలాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. మండలంలోని తల్లిదండ్రి లేని 500 మంది ఆడబిడ్డల ను గుర్తించినట్లు, ప్రస్తుతం 20 మందికి రూ.25వేల చొప్పున పోస్టల్ బాండ్లను ఆందజేస్తున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా 500 ఆడబిడ్డలకు మొత్తం రూ.1. 25 కోట్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
మైనంపల్లి ట్రస్టు ఆధ్వర్యంలో మెదక్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి మండలంలోని సుమారు రూ.50లక్షల వ్యయంతో మోడల్ స్కూల్ భవనాన్ని నిర్మిస్తామన్నారు. తాగునీటి సౌకర్యం లేని గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని రోహిత్ తెలిపారు. మెదక్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి పల్లెను అభివృద్ధి చేయడమే మైనంపల్లి ట్రస్టు ఉద్దేశం అన్నారు. సంకాపూర్తండాలో రోహిత్ను గిరిజన మహిళలు నృత్యాలతో పాటలు పాడుతూ ఆహ్వానించారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, సంకాపూర్ సర్పంచ్ సుజాత, సంకాపూర్తండా సర్పంచ్ భూలక్ష్మి, శేరిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణాగౌడ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.