పాపన్నపేట, ఫిబ్రవరి 3: ఏడుపాయల జాతర సమీపిస్తున్నందున అధికారులు ఉతసవ ఏర్పాట్లను వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం ఏడుపాయల వనదుర్గాభవానీమాతను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏడుపాయల పరిసరాల్లో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డితో కలిసి పర్యటించి జాతర ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు, ద్విచక్రవాహనాల పార్కింగ్కు అసైన్డ్ భూములు ఉపయోగించుకొని ఏర్పాట్లు చేయాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చే భక్తులకు దేవాదాయ, ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయం వద్ద బస్టాండ్ వరకు ఉచిత మినీ బస్సులు, ఆటోల సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. పోతాన్శెట్టిపల్లి వైపు బస్టాండ్ వద్ద భక్తులు వేచి ఉండేందుకు షామియానాలు, తాగు, మరుగుదొడ్లు, బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. చెలిమెలకుంట వద్ద రోడ్డుకు ఇరుపక్కలా, వాహనాల పార్కింగ్ వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేయాలని, ప్రైవేటు వాహనాలు జాతరలోనికి అనుమతించొద్దని, వీఐపీ వాహనాలకు ప్రత్యేక అనుమతుల పాస్లను పోలీసులు కేటాయించాలని సూచించారు. వాహనాల పార్కింగ్ స్థలాల వద్ద తాగునీటి నల్లాలు, తాత్కాలిక మరుగుదొడ్లతో పాటు భక్తులకు ప్రైవేటు ఉచిత ఆటోను ఏర్పాటు చేయాలన్నారు. జాతరలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని, పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసి చెత్తా చెదారం తరలించేందుకు గ్రామ పంచాయతీ వాహనాలను ఉపయోగించుకోవాలన్నారు. జాతర కోసం నిర్మిస్తున్న నిర్మాణాల పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
జాతర పరిసర ప్రాంతాలతో పాటు నదీపరీవాహక ప్రాంతాల ఇరుపక్కల ఎల్ఈడీ విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతరాయం లేకుండా విద్యుత్ లైట్లు వెలిగేలా చూసుకోవాలని, నీటి ప్రమాదాలు జరుగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి వారికి లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలిగించేలా చూడాలని, అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, అగ్నిమాపక సిబ్బంది ఫోన్ నంబర్కు సమాచారం అందివ్వాలని సూచించారు. నదీపరీవాహక ప్రాంతాలైన బఫర్జోన్లో నిర్మాణాలు చేపట్టడం విరుద్ధమని అక్కడ నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వారు వనదుర్గాభవానీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. వీరికి ఆలయ పాలక మండలి చైర్మన్ బాలాగౌడ్, ఈవో శ్రీనివాస్ శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సాయిరాం, నీటి పారుదలశాఖ ఈఈ శ్రీనివాస్, డీపీవో సాయిబాబా, పం చాయతీరాజ్శాఖ డీఈ పాండు రంగారెడ్డి, తాగునీటిశాఖ కమలాకర్, స్థానిక తహసీల్దార్ మ హేందర్, కొల్చారం తహసీల్దార్ చంద్రశేఖర్, ధర్మకర్తలు వెంకటేశం, యాదయ్య, బాగారెడ్డి, పెంటయ్య, మనోహర్, మోహన్రావు, సాయి లు, డీఎస్పీ సైదులు తదితరులున్నారు.