సిర్గాపూర్, డిసెంబర్ 19: నీటిని వృథా చేయకుండా పొదుపు వాడుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి తెలిపారు. నల్లవాగు ప్రాజెక్టు కింద యాసంగి పంటల సాగుకు స్థానిక ఎంపీపీ మహిపాల్రెడ్డి, జడ్పీటీసీ రాఘవరెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే నీటిని వదిలారు. అంతకుముందు స్థానికులు ఆయకట్టుదారుల ఆచారం ప్రకారం ఎమ్మెల్యే గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ మేరకు రైతులు, మత్స్యకారులు తయారు చేసిన తెప్పను నీళ్లలో వదిలారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఏడాదిలో ఆయకట్టు కింద రెండో పంట, ఆరుతడి పంటలకు గాను 5100 ఎకరాలకు తైబందీ చేసినట్లు పేర్కొన్నారు. దీంట్లో ఎమర్జెన్సీగా కుడి కాల్వ కింద గోసాయిపల్లి గ్రామ శివారులో యాసంగికి 60 ఎకరాల్లో వరి పంట సాగు చేసుకోవచ్చని తెలిపారు.
మిగతా 5040 ఎకరాల్లో ఆరుతడి పంటలు వేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. చివరి ఆయకట్టుకు సాగు నీరందేలా ఎగువ ప్రాంత రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కల్హేర్ జడ్పీటీసీ నర్సింహరెడ్డి, కల్హేర్ ఎంపీపీ సుశీల, స్థానిక సర్పంచ్ గంగామణి నర్సింహులు, ఎంపీటీసీ ప్రేమలా రాములు, ఉప సర్పంచ్ భూషణం, ఐబీ ఈఈ భీమ్, డీఈఈ పవన్కుమార్, ఏఈఈ సూర్యకాంత్, రవి, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.