నర్సాపూర్/కౌడిపల్లి, డిసెంబర్ 7: ఎల్లేరు గడ్డలు (అడవి దుంపగడ్డలు) తిని తల్లీకొడుకు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని వెంకట్రావుపేటలో బుధవారం జరిగింది. ఏఎస్సై శ్రీనివాస్, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం వెంకట్రావుపేటకు చెందిన నీలం శ్రీనివాస్ (48) తన అత్తగారైన రాయిలాపూర్ గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఎల్లేరు గడ్డలు తవ్వుకుని అదే రోజు రాత్రి తన ఇంటికి వచ్చి గడ్డలు ఉడకబెట్టుకుని, జున్నుపాలలో ఎల్లేరుగడ్డ వేసుకుని కుటుంబ సభ్యులు ఆరుగురు కలిసి తిన్నారు. అర్ధ రాత్రి సమయంలో అందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఉదయం శ్రీనివాస్ మృతిచెందాడు.
మృతుడి తల్లి నీలం వెంకటమ్మ (75) పరిస్థితి విషమంగా ఉండడంతో సంగారెడ్డి దవాఖానకు తరలించాలని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను తరలిస్తున్న క్రమంలో సంగారెడ్డి వెళ్లే మార్గమధ్యలో మృతి చెందింది. మృతుడి భార్య లక్ష్మి, అక్క లలిత చికిత్స పొందుతున్నారు. ఇద్దరు కుమారులు రాంచందర్, శ్రీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారు. మృతుడి కొడుకు రాంచందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనివాస్ తెలిపారు. నర్సాపూర్ దవాఖానలో డాక్టర్లు సరైన వైద్యం అందించక, ఇద్దరు మృతి చెందారని మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు దవాఖాన ఎదుట ధర్నా చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామంలో జరిగిన ఘటనను తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి గ్రామానికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషయం తెలుసుకుని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.