చేర్యాల, జనవరి 1: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారిపోయింది. స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 20వేల మందికి పైగా భక్తులు కొమురవెల్లికి తరలివచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు కావడంతో చేర్యాల, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, జనగామ, బచ్చన్నపేట, కరీంనగర్ తదితరల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వచ్చారు. ఏటా మొక్కులు చెల్లించుకునే భక్తులు శనివారం ఉదయం నుంచే మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ నిర్వహణలో ఉన్న గదులతోపాటు ప్రైవేటు గదులు అద్దెకు తీసుకుని బస చేశారు.
ఆదివారం కోనేరులో స్నానం చేసి, స్వామి దర్శనానికి క్యూలో గంటల పాటు వేచి దర్శించుకున్నారు. భక్తులు అర్చన, ప్రత్యేక పూజలు, కేశఖండన, నజరు, మహామండప, చిలుక పట్నం, బోనం, టెంకాయలు, హుండీలో కానుకలు వేసి మొక్కులు సమర్పించుకున్నారు. మరికొందరు తమ మొక్కులు తీర్చాలని గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, సంతానం కలగాలని ఒల్లు బండ పూజలు, రాతిగీరల వద్ద మొక్కులు, కోడెను కట్టివేసి స్వామి వారిని వేడుకున్నారు. ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్ నీలశేఖర్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు సేవలు అందించారు.