మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 22 : రంజాన్ పర్వదినాన్ని జిల్లావ్యాప్తంగా ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహిం చుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు కొనసాగిన ఉపవాస దీక్షలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. శనివారం ఉదయం ఈద్గా, మసీదుల వద్దకు అధిక సంఖ్యలో చేరుకుని సామూహిక ప్రార్థనలు చేశారు. మతపెద్దల సందేశాలను శ్రద్ధ్దగా విన్నారు. అనంతరం ఒకరినోకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మెదక్లోని నవాబుపేట వీధిలో ఈద్గా వద్ద ఉదయం 10 గంటలకు వేలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేశారు. ప్రార్థనల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ పాల్గొని రంజాన్ శుభకాంక్షాలు తెలిపారు.
రంజాన్ మాసం దానధర్మాలకు నిలయమని.. పేదలను ఆదుకోవడమే ఈద్-ఉల్-ఫితర్ పరమార్థమని ముస్లిం మత గురువులు ఖాజామొయినొద్దీన్, ఆరీఫ్ అన్నారు. రంజాన్ పురస్కరించుకుని ఈద్గా మైదానానికి తరలివచ్చిన ముస్లింలతో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. సమాజంలోని అన్ని మతాల వారు ఐకమత్యంగా ఉండాలన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని రంజాన్ పవిత్రతను వివరించారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఈద్గా వద్ద ఏర్పాట్లకు మున్సిపల్ తరపున రూ.2లక్షలు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు మతపెద్దలు ఖాజామొయినొద్దీన్, ఆరిఫ్కు అందజేశారు.
రంజాన్ మాసం పవిత్రత, ఐక్యత.. త్యాగానికి చిహ్నమని ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. నర్సాపూర్లోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నర్సాపూర్లో గురుకుల పాఠశాలను, మహిళ భవనాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే మదన్రెడ్డి హామీ ఇచ్చారు.
– మెదక్ జిల్లా నెట్వర్క్, ఏప్రిల్ 22