తూప్రాన్, ఏప్రిల్ 6 : క్రీడలతో శారీరక ఉల్లాసం, మానసిక ధృడ త్వం కలుగుతుందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. గురువారం తూప్రాన్ మున్సిపాలిటీలోని 12వ వార్డు ఏబీకాలనీలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాన్ని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, చైర్మన్ రాఘవేందర్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. యువ క్రీడాకారులకు కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించారు.
యువత చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. చైర్మన్ రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ గతంలో యువత ఆటలాడేందుకు తగిన స్థలం లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మున్సిపాలిటీలో ప్రతి వార్డుకో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం చాలా గొప్పవిషయమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లక్ష్మీబాయి నర్సోజీ, కమిషనర్ మోహన్, మండలాధ్యక్షుడు బాబుల్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.