సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, మార్చి 29: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏఒక్క హామీ నెరవేర్చడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రెండు లక్షల రుణమాఫీ అయినోళ్లు, రూ.4 వేల పింఛన్, వరి ధాన్యానికి రూ.500 బోనస్, ఎకరానికి రూ.15 వేల రైతుబంధు, మహిళలకు నెలకు రూ.2500 వచ్చిన వాళ్లు కాంగ్రెస్కు, మిగతా వాళ్లందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు.
ఈ విషయాలన్నీ కార్యకర్తలు గ్రామాల్లో చర్చ పెట్టాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు సిద్దిపేట అంటే కండ్లమంట అని.. అందుకే ప్రతి సారి సిద్దిపేట మీద విషం చిమ్మారన్నారు. అలాంటి వారికి ఓటు వేసి మన కండ్లను మనమే పొడుచుకుందామా.. అని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి కోసం తాను ఎంతో కష్టపడి పనిచేశానని, ఈ జిల్లాను ఓర్వలేని వారు మనకు ఏం న్యాయం చేస్తారని హరీశ్రావు అన్నారు. ఈ జిల్లాలో ప్రతి మూల తెలిసిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని.. పార్లమెంట్లో మనకోసం గళం విప్పి మన మెదక్ జిల్లాకు న్యాయం చేయగలిగే వ్యక్తి ఆయన అన్నారు. మాయమాటలు చెప్పి దుబ్బాక ఎన్నికల్లో గెలిచిన రఘునందన్రావు, మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓడగొట్టారో చెప్పాలన్నారు.
ఇచ్చిన మాట మీద నిలబడి.. ఇచ్చిన హామీలు నెరవేరిస్తే దుబ్బాక ప్రజలు ఎందుకు ఓడగొట్టారో చెప్పాలన్నారు. ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలో 200 దేవాలయాలు కట్టిచ్చామని.. కానీ, దేవుడి పేరు మీద రాజకీయం చేయలేదన్నారు. సిద్దిపేట ప్రజలే తన కుటుంబ సభ్యులుగా పనిచేశానని.. సిద్దిపేట ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని సిద్దిపేటలో 1000 పడకల దవాఖాన నిర్మించామని తెలిపారు. రేవంత్రెడ్డి సీఎం అయ్యాక చిన్నకోడూర్ రోడ్డును ఆపివేశారని, అలాగే వెటర్నరీ కళాశాల మంజూరు చేయిస్తే కొడంగల్కు తరలించారన్నారు. సిద్దిపేటకు రాకుండా ఇన్ని ఆపిన కాంగ్రెస్కు ఓటుతో సమాధానం చెప్పాలని కోరారు. ఇవన్నీ గ్రామాల్లో చర్చ పెట్టాలన్నారు.
కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడే వాడే నిజమైన కార్యకర్త అన్నారు. సిద్దిపేట అంటే, మెదక్ అంటే రాష్ట్రంలో ఒక గౌరవం ఉందని.. ఆ గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడాలన్నారు. తండ్రి లాంటి కేసీఆర్కు అండగా ఉండాల్సిన సమయం ఇదే అన్నారు. వెంకట్రామిరెడ్డి మంచి మాట చెప్పారని.. కార్యకర్తలు, ప్రజల కోసం సేవ చేసేందుకే విద్యానిధి కింద ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని చెప్పారన్నారు. కార్యకర్తల పిల్లల కోసం ఫంక్షన్హాళ్లను నిర్మించి ఉచితంగా వాడుకునేందుకు ఇప్పిస్తా అని చెప్పారన్నారు.
గ్రామాల్లో ప్రతి నాయకుడు, కార్యకర్త ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి దొరకడం మన అదృష్టమని, ఆయనను గెలిపించే బాధ్యత మనందరిపై ఉందని హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తెలంగాణ ప్రజలను ఎవరూ కొనలేరన్నారు. ఎక్కడ పోరాటం ఉన్నా.. ఎక్కడా ఉద్యమం ఉన్నా సిద్దిపేట కార్యకర్తలు కష్టపడి కొట్లాడిన చరిత్ర ఉందని గుర్తుచేశారు. తన ఎన్నిక కోసం ఎలా కష్టపడ్డారో, వెంకట్రామిరెడ్డి ఎన్నిక కోసం కూడా కార్యకర్తలు అలాగే కష్టపడాలని పిలుపునిచ్చారు.
సిద్దిపేట పట్టణంలోని కొండ మల్లయ్య గార్డెన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సిద్దిపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం క్యాడర్లో జోష్ నింపింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్ధ్ధానాలను వీడియో రూపంలో ప్రజలకు వివరించిన సమయంలో ప్రజలు చప్పట్లు కొట్టారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తన ప్రస్థానం గురించి, తను భవిష్యత్లో చేసే సేవల గురించి వివరించినప్పుడు కార్యకర్తలు ఒకింత ఎమోషనల్ కాగా.. ఆయనను సమర్థిస్తూ ఈలలు వేసి జోష్ నింపారు.
సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు, సుడా మాజీ చైర్మన్ రవీందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, రైతుబంధు సమితి జిల్లా మాజీ కన్వీనర్ వంగ నాగిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పూజల వెంకటేశ్వర్రావు(చిన్నా), వేణుగోపాల్రెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.