చేర్యాల, ఫిబ్రవరి 4: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామిని ఆదివారం మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్ననాటి నుంచి మల్లన్న దర్శనం కోసం కొమురవెల్లికి వస్తున్నానని, తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవనం కొనసాగించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఒకప్పుడు స్వామివారి క్షేత్రంలో గదులు, రోడ్లు, తాగునీటి సమస్య, రవాణా వ్యవస్థ సక్రమంగా లేక భక్తులు అనేక ఇబ్బందులు పడేవారన్నారు.
బీఆర్ఎస్ పాలనలో భక్తుల కోసం ఎన్నో వసతులు కల్పించామని, ప్రజల రాక పెరగడంతో పాటు ఆదాయం సైతం పెరిగిందన్నారు. రెండు వారాలుగా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, తెలంగాణ పల్లెల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి జనం రావడం సంతోషంగా ఉందన్నారు. గుడి దగ్గర రాజకీయాలు చేయవద్దని, దాసారం గుట్టపైన తాను హామీ ఇచ్చిన విధంగా ఆధునిక వసతులతో గెస్ట్హౌస్ నిర్మాణం చేపడుతానని, తానేకాకుండా దాతలతో భవనాలు కట్టించేవిధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.