అన్ని పండుగలకు తెలంగాణ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నదని, ప్రతి పేదవాడు పండుగలను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కానుకలు అందిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా శుక్రవారం స్థానిక వైస్రాయ్ గార్డెన్లో వెయ్యి మంది క్రైస్తవులకు గిఫ్ట్లను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త జిల్లా ఏర్పడ్డాక పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, ఇటీవల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. రైలు సౌకర్యం వచ్చిందని, త్వరలో మెడికల్ కాలేజీ కూడా మంజూరు అవుతుందని పేర్కొన్నారు. క్రిస్టియన్ శ్మశానవాటికకు స్థలంతో పాటు కమ్యూనిటీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
మెదక్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప్రతి పేదవాడు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లు అందజేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ అన్ని మతాలు, వర్గాలను సమానంగా గౌరవిస్తూ పేదవాడు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని అధికారికంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ కొత్త బట్టలను అందజేస్తున్నదన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా శుక్రవారం స్థానిక వైస్రాయ్ గార్డెన్లో మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని క్రిస్మస్ కేక్ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచమంతా శాంతియుతంగా, ప్రేమ పూర్వకంగా ఉండాలని, మనకు తెలిపిన త్యాగశీలి, దయామయుడు యేసు ప్రభువని, ఆయన దయ అందరిపై ఉండాలని కోరుకుంటూ, యేసు ప్రభువు బోధనలను ప్రతి ఒకరూ పాటించాలని హితవు పలికారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చితో పాటు ఖిల్లా, ఏడుపాయల జిల్లా కీర్తిని ఇనుమడింపజేస్తున్నాయన్నారు.
నూతనంగా మెదక్ జిల్లా ఏర్పడ్డ తర్వాత పట్టణాన్ని అందమైన రోడ్లతో సుందరీకరించుకుంటున్నామన్నారు. ఇటీవల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని రికార్డు స్థాయిలో 407 కాన్పులు చేశామని, రైలు వచ్చిందని, త్వరలో జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కానున్నదని, సకల సౌకర్యాలతో నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మించుకుంటున్నామన్నారు. మిగిలిపోయిన అర్హులైన మరికొందరికి పింఛన్లు అందిస్తామని, సొంత జాగా కలిగిన వారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా వెయ్యి మంది క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందజేశారు. క్రైస్తవుల విజ్ఞప్తి మేరకు శ్మశాన వాటికకు స్థలం, కమ్యూనిటీ భవన నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మారెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, ఆర్డీవో సాయిరాం, జిల్లా మైనార్టీ అధికారి జెంలా నాయక్, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్, మెదక్ నియోజకవర్గ క్రిస్టియన్ సెలెబ్రేషన్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు రెవరెండ్ సంజీవరావు, అశోక్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.