చేర్యాల, నవంబర్ 4 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ వేడుకలకు ప్రచారం నిర్వహించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించడంతో ఆలయ ఈవో ఆలూరి బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వామి వారి కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలకు హైదరాబాద్ జంటనగరాలతో పాటు జిల్లాలు మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు నాలుగు బృందాలు స్వామి వారి ఆలయం నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాల వివరాలతో కూడిన వాల్పోస్టర్లను తీసుకువెళ్లాయి.
ఒక్కో బ్యాచ్లో నలుగురు వ్యక్తులు ఆయా జిల్లా కేం ద్రాలు, ముఖ్య ప్రదేశాల్లో బ్రహ్మోత్సవ వాల్పోస్టర్లను అతికించడంతో పాటు అదే ప్రదేశం నుంచి వాట్సాప్లో ఫొటోలు సైతం ఆలయ అధికారులకు రెండు రోజులుగా పంపిస్తున్నారు. ఇవే కాకుండా ముఖ్యంగా అన్ని ప్రదేశాలను కలుపుతూ ప్రయాణించే ఆర్టీసీ బస్సులకు పోస్టర్లను అతికిస్తున్నారు. ఓ బృందం సభ్యులు కామారెడ్డి, రామాయంపేట, నిజామాబాద్, బాసర, నిర్మల్, బోధనలలో పోస్టర్లు అతికించి తిరిగి ప్రయాణమైంది. మరో బృందం కరీంనగర్, వేములవాడ, కొండగట్టు తదితర ప్రాంతాలల్లో పోస్టర్లు అతికిస్తున్నది. స్వామి వారి ఆల య ధర్మకర్తల మండలి,అర్చకులు, సిబ్బంది మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు జిల్లా స్థాయి అధికారులకు కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికలను హైదరాబాద్, సిద్దిపేటలో అందజేస్తున్నారు. దీంతో పాటు మరికొందరు సిబ్బంది ఆలయ అభివృద్ధికి విరాళాలు అందజేసే దాతలు, క్షేత్రంలో కాటేజీలు నిర్మించిన వారికి పత్రికలు పంపిస్తున్నారు.ఈ యేడాది స్వామి వారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ప్రచారం సాగిస్తున్నారు.