దుబ్బాక, ఫిబ్రవరి16: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో సాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పంటలకు సాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వెంటనే కాల్వ ల నిర్మాణాలు చేపట్టి రైతుల సమస్య పరిష్కరించాని శుక్రవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన లేవనెత్తారు. దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి సరఫరా జరుగుతున్నదన్నారు. పలు చోట్ల చిన్న కాల్వ ల నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. నియోజకవర్గంలో శంకరంపేట, రామాయంపేట, సంగారెడ్డి, ఉప్పరపల్లి, సిద్దిపేట ప్రధాన కాల్వలు ఉన్నాయని, ప్రధాన కాల్వలకు అనుసంధానంగా తవ్విన చిన్న కాల్వల నిర్మాణాలు పూర్తి చేయలేదన్నారు.
నియోజకవర్గంలో ప్రధానంగా చేగుంట, నార్సింగ్ మండలాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. రామాయంపేట, శంకరంపేట, ఉప్పరపల్లి కాల్వ ల ద్వారా నీటి సరఫరా చేయడం లేదని ఆరోపించారు. అటవీశాఖ అధికారులు చిన్న కాల్వలను అడ్డుకోవడంతో సమస్యగా మారిందన్నారు. కేసీఆర్ సర్కారులో నియోజకవర్గంలో సాగునీరు పుష్కలంగా ఉండేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఈ విషయంపై సీఎం, సంబంధిత మంత్రులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.