దుబ్బాక, మే 20: పంట అమ్ముకునేందుకు అన్నదాతలు రోడ్డ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు, ధర్నాలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని ఆయన మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దుబ్బాక మండలం రామక్కపేట కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా ఎందుకు కాంటా వేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు తరలించేందుకు లారీలు రావడం లేదన్నారు. దుబ్బాకలో ధాన్యం కొనుగోలు సమస్యలపై సిద్దిపేట కలెక్టర్ హైమావతికి ఫోన్లో వివరించారు. అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైస్మిల్లర్లతో సమావేశమయ్యారు. దుబ్బాక మార్కెట్ యార్డు లో 15 వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రెండు గోదాములను రైస్ మిల్లర్లకు అప్పగించారు. వీటికి సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను రైస్మిల్లర్లకు ఆయన అందజేశారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘దొడ్డు రకం వడ్లు వద్దు.. సన్న రకం వడ్లు ముద్దు’ అనే నినాదంతో ఖరీఫ్లో వరి సన్నరకం వంగడాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ్యలంతోనే రైతులకు ఇబ్బందులు నెలకొన్నాయని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయాలని నిత్యం సిద్దిపేట జిల్లాలోని రైతులు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్సంగీత, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చింత రాజు, నల్ల శ్రీనివాస్. కూర వేణు, బీఆర్ఎస్ నాయకులు రాజమౌళి, రవీందర్రెడ్డి, కిషన్రెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీనివాస్, కైలాశ్, రాజు, నరేశ్ పాల్గొన్నారు.