సిద్దిపేట, ఏప్రిల్ 6: అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చి ఇప్పుడు రైతుల ఉసురు తీస్తున్నాడని, నేడు వచ్చింది కాలం తెచ్చిన కరువుకాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని దుబ్బాక ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేటలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రాధాకృష్ణశర్మ అధ్యక్షతన చేపట్టిన రైతుదీక్షకు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ ఆభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంత వేగంగా ప్రాజెక్టులు నిర్మించి, నీళ్లు అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దకుతుందన్నారు. కాళేశ్వరం అనే మహాయజ్ఞంలో చిన్న పొరపాటు జరిగితే సరిదిద్దాల్సిన ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ రైతులతో ఆడుకుంటున్నదన్నారు. మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు డెబ్బతింటే కాపర్ డ్యామ్ ఏర్పాటు చేసి, నీటిని ఎగువకు తరలించకుండా నిరక్ష్యంగా వ్యవహరించడంతో పొలాలకు పారాల్సిన గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయన్నారు. కేసీఆర్ హయాంలో మిడ్మానేరు, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిండుకుండలా ఉండేవని, నేడు నీళ్లులేక వట్టిపోయాయన్నారు.
నాడు సాగు సమయంలో ఇచ్చే రైతుబంధు సాయం నేడు పంటలు కోతకు వచ్చినా ఇవ్వడం లేదన్నారు. రుణమాఫీ, బోనస్ ఇవ్వకపోతే రైతులు అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. అభివృద్ధిలో ముందున్న సిద్దిపేటపై రేవంత్ రెడ్డి సరారుకు కన్ను కుట్టిందని, చిన్నాభిన్నం చేయాలని కుట్రలు చేస్తున్నదన్నారు. 3 లక్షల ఓట్ల మెజార్టీతో నన్ను రెండుసార్లు గెలిపించారు.. ఇప్పుడు అదే పట్టుదల తో వెంకట్రామిరెడ్డిని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే మనకు ఎంతో గౌరవం ఉంటుందన్నారు. సంక్రాంతికి గంగిరెద్దులా ఇండ్ల ముందుకు వచ్చినట్లు ఎన్నికల సమయంలో కొందరు వస్తున్నారని, ఏవి నీళ్లో, ఏవి పాలో ప్రజలు గమనించాలన్నారు.
దుబ్బాకలో చిత్తుగా ఓడిన వ్యక్తి నేడు బీజేపీ ఆభ్యర్థిగా వస్తున్నాడని, మళ్లీ చిత్తుగా ఓడించాలన్నారు. సిద్దిపేట, మెదక్లకు రైలు, సిద్దిపేటలో కేంద్రీయ విద్యాలయం, మెదక్ నుంచి ఈదులనాగులపల్లికి రూ. 17,000 కోట్లతో కొత్త లైన్, చేగుంట జాతీయ రహదారిపై ఐదు బ్రిడ్జీలు, ఫైఓవర్లు, 18 అండర్ పాస్లు, భెల్లో పెద్ద జంక్షన్ ఏర్పాటు చేశామని చెప్పారు. సిద్దిపేట జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కు మరోసారి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు, సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డితో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, సొసైటీ చైర్మన్లు, మాజీ మారెట్ కమిటీ చైర్మన్లు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
నీళ్లున్నా ప్రాజెక్టులను ఎండబెట్టి సక్రమంగా కరెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కన్నీళ్లు మిగిల్చిందని మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ పచ్చగా ఉండేనని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరువు కష్టాలు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణ రాక ముందు జనరేటర్లు, ఇన్వైటర్ల అవసరం ఉండేదని, నేడు నాటి కాలం దాపురించిందన్నారు. సీఎం కేసీఆర్ 24గంటల నాణ్యమైన కరెంటును సరఫరా చేశారన్నారు. కాంగ్రెస్ పాలన 100 రోజుల్లోనే విద్యుత్ వ్యవస్థ కుప్ప కూలిందన్నారు. ఎండిపోతున్న పంటలకు నీళ్లిచ్చి రైతలను ఆదుకోవాలన్నారు. కలెక్టర్గా మీతో కలిసి పనిచేశానని, నేడు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకొస్తున్నాను.. ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాక పోరాటం చేస్తామని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు బోగస్ అంటున్న కాంగ్రెస్ నాయకులు సరస్వతి డ్యాంలోకి నీళ్లు ఎలా వస్తున్నాయో, మల్లన్న సాగర్ నుంచి కాలువ నీటిని మంత్రి కొండా సురేఖ ఎలా విడుదల చేశారో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి ఉన్న జిల్లాలను కుదించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. సిద్దిపేట వెటర్నరీ కళాశాలను రద్దు చేసిన సీఎంకు ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న కాంగ్రెస్ను ఖతం చేయాలని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పిలుపునిచ్చారు. రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి రూ. 500 బోనస్ ఏమైందన్నారు. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు.