పటాన్చెరు, అక్టోబర్ 16: పటాన్చెరు నియోజకవర్గంలో రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోకు తోడుగా నవరత్న మ్యానిపెస్టోను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రకటించారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో ఏర్పాటు చేసిన సమవేశంలో నియోజకవర్గ మ్యానిఫెస్టో నవరత్నాలును ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, శాసనమండలి ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ, నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం విజయం సాధించిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి దేశానికే ఆదర్శమన్నారు. మినీ ఇండియాగా పిలిచే పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చారిత్రాత్మకమన్నారు. పారదర్శకమైన పాలనలో పటాన్చెరు నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందున్నదన్నారు. ప్రజల సహకారంతో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన పార్టీ మ్యానిఫెస్టో అన్నివర్గాల ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. నియోజకవర్గంలో రూ.9వేల కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. చేసిన అభివృద్ధిని చూపి ప్రజలకు ఓట్లు అడుగుతామన్నారు. కంటి ముందు అభివృద్ధి- ఇంటి ముందు అభ్యర్థి పేరున ప్రచారం నిర్వహిస్తామన్నారు. 55 గ్రామ పంచాయతీలు అభివృద్ధికి మారుపేరులా చేశామన్నారు. అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీలు ఆదర్శమున్సిపాలిటీలుగా మార్చామన్నారు. పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ నగరంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న డివిజన్లన్నారు. వేలాది కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశామన్నారు.
మహిపాల్రెడ్డి చేసిన పనులు భేష్..
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి చేసిన అభివృద్ధి భేష్ అని మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి కోసం పనులు చేయడంలో ఎమ్మెల్యే ముందున్నారన్నారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో అన్నివర్గాలను అభివృద్ధి చేసేలా ఉందన్నారు. పటాన్చెరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఎమ్మెల్యే ప్రకటించిన నవరత్నాలు మ్యానిఫెస్టో బాగుందని కొనియాడారు. ప్రజలు బీఆర్ఎస్ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీలు సుధాకర్రెడ్డి, సుప్రజావెంకట్రెడ్డి, కుమార్గౌడ్, ఎంపీపీలు సుష్మశ్రీవేణుగోపాల్రెడ్డి, ఈర్ల దేవానంద్, కార్పొరేటర్లు పుష్పానగేశ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, పరమేశ్, శకీల్, గూడెం యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
1. 55 గ్రామ పంచాయతీల్లో అంబులెన్స్లు అందజేత, ప్రజలకు అత్యవసర వేళ సాయం.
2. ప్రతి గ్రామంలో మహిళా సమాఖ్య భవనం నిర్మాణం. అన్ని పంచాయతీల్లో మహిళా భవనాలు నిర్మించేందుకు హామీ.
3. ప్రతి మండలంలో మినీ స్టేడియం. ఐదు మండలాల్లో ఐదు ఎకరాల చొప్పున కేటాయింపు. యువత, క్రీడాకారుల కోసం స్టేడియాల నిర్మాణం.
4. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా ప్రతి ఫంక్షన్హాల్స్ నిర్మాణం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులు పెండ్లిళ్లు చేసుకునేందుకు అవకాశం.
5. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు పట్టుచీరల పంపిణీ.
6. నిరుద్యోగ యువతీయువకులకు ఉచిత శిక్షణ కేంద్రం. అన్ని పోటీ పరీక్షలకు, పరిశ్రమల్లో ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు హామీ.
7. గుమ్మడిదల, అమీన్పూర్ మండలాల పరిధిలో నూతన జూనియర్ కళాశాలల ఏర్పాటు.
8. గుమ్మడిదల మండలంలోని రైతులకు ఆధునిక వసతులతో గోదాము నిర్మాణం చేసి అందుబాటులోకి తేవడం.
9. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కమ్యూనిటీల కోసం 15 ఎకరాల్లో వైకుంఠధామాల నిర్మాణం, ముస్లింలకు ఖబ్రస్థాన్ల ఏర్పాటు.