పేదలను దోచుకోవడం బీజేపీ వంతైతే.. వారిని ఆదుకోవడం బీఆర్ఎస్ నైజం అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శివ్వంపేట మండలం దొంతి గ్రామ శివారులో పార్టీ మండల అధ్యక్షుడు రమణాగౌడ్ అధ్యక్షతన శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి తన్నీరు హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ, జిల్లా ఇన్చార్జి యెగ్గె మల్లేశం, ఎమ్మెల్యే మదన్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ చేశామని, తాలూకాలోని 84 తండాలను పంచాయతీలుగా ప్రకటించామని గుర్తుచేశారు. పాంబండ, గోమారం, నవాబ్పేట రోడ్డు పనులు ప్రారంభించాలని స్థానిక నాయకులు కోరారని, తక్షణమే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన సాగిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లకు గుణపాఠం చెప్పాలంటే ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించాలని సూచించారు.
– శివ్వంపేట, మార్చి 31
శివ్వంపేట, మార్చి31 : బీజేపీ ధరలు పెంచితే బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను పంచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం శివ్వంపేట మండలం దొంతి గ్రామ సమీపంలోని జీవన్దివ్య గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణాగౌడ్ అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ, జిల్లా ఇన్చార్జి యెగ్గె మల్లేశం, ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమ్మేళనం ఎన్నికల సమావేశం కాదని కేవలం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశమని వెల్లడించారు. పాంబండ, గోమారం, నవాబ్పేట రోడ్డు పనులు ప్రారంభించాలని కొందరు నాయకులు కోరారని, తక్షణమే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ధరణిలో సమస్యలు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, కలెక్టర్, ఉన్నతాధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.
శివ్వంపేట్ మండల పరిధిలో సొంత జాగా ఉన్న అర్హులకు ఇండ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నదని, అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పు జరిగిందో గుండెలపై చేయి వేసుకొని ఆలోచించాలన్నారు. తొమ్మిది ఏండ్ల కిందట కరెంట్ ఎట్లుండే, ఎరువుల బస్తాలు ఎట్లుండే, విత్తనం సంచులు ఎట్లుండే , మంచినీరు ఎట్లుండే, పింఛన్ ఎంత, పండించిన ధాన్యాన్ని అమ్మడం ఎంత కష్టముండే, ఆడపిల్ల పెళ్లికి ఎవరైనా ఒక్క రూపాయి ఇచ్చిర్రా అనే విషయాలను గ్రహించాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఏ పత్రిక చూసినా ప్రతి రోజూ రైతుల ఆత్మహత్యలు కనిపించేవని, నేడు ఆత్మహత్యలు చాలా తగ్గాయని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ పేదలకు ఉచితంగా బియ్యం, 2016 పెన్షన్, రైతుబంధు రూ.10 వేలు, కల్యాణలక్ష్మీ కింద రూ. లక్షా నూట పదహార్లు ఇస్తున్నాడని అన్నారు. అలాగే, బాలింతలకు కేసీఆర్ కిట్, గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కొనుగోలు చేయడంతో పాటు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నాడని వెల్లడించారు. ఆనాడు అట్టడుగున ఉన్న తెలంగాణ ప్రాంతం నేడు దేశానికి దిక్సూచిగా మారిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నర్సాపూర్ తాలూకా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. పట్టణం రెవెన్యూ డివిజన్ ఐయిందని, కొత్త మండలాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
నర్సాపూర్ తాలూకాలోని 84 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించి, మా తండాల్లో మా పాలన అనే విధంగా గిరిజన బిడ్డలే సర్పంచ్లు అయ్యారని గుర్తుచేశారు. తండాల్లో పంచాయతీ భవనాలను నిర్మాణానికి ఒక్కో భవనానికి రూ. 24లక్షలు మంజూరు చేశామన్నారు. ఒకప్పుడు శివ్వంపేట మండలంలో గిరిజన అక్కాచెల్లెళ్లు ఆడపిల్ల పుడితే వదిలేసి వెళ్లిన సంఘటనలు ఉన్నాయని, కానీ నేడు సీఎం కేసీఆర్ ఆడపిల్లను ఒక లక్ష్మీగా భావించి కల్యాణలక్ష్మి పథకాన్ని మేనిఫెస్టోలో లేకున్నా ప్రవేశపెట్టాడని, ఆడపిల్లలు చదువుకోవడానికి 500 రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలలు ఏర్పాటు చేసి చదివిస్తున్నాడని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం మేనిఫెస్టోలో ఎన్నో హామీలను చూపించి, ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.
బీజేపీని గెలిపిస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, విదేశాల్లో నల్లధనం తెచ్చి పేదలకు మనిషికి రూ.15లక్షల చొప్పున ఖాతాల్లో వేస్తామని, పెద్దనోట్లు రద్దుచేసి జన్ధన్ ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పిన ప్రధాని మోదీ మాట తప్పాడని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్ మీద బీజేపీ ప్రభుత్వం తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 89వేల967 కోట్లు సెస్ రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిందన్నారు. పేదలను దోచుకొనుడు బీజేపీ వంతైతే.. పేదలను ఆదుకోవడం మన సీఎం కేసీఆర్ నైజం అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పడుతుందని జోష్యం చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్లకు గుణపాఠం చెప్పాలంటే ప్రతి కార్యకర్త గ్రామాల్లోని ప్రజలకు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలన్నారు. ఇల్లులేని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, మనస్పర్థలు ఉంటే పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తెచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆత్మీయ సమ్మేళనంతో ప్రతిపక్షాల్లో గుబులు : చిలుముల మదన్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలను చూసి ఎదుటి పార్టీ నాయకుల్లో గుబులు రేగుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో అనుభవం కలిగిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని, పటిష్టమైన నాయకత్వం ఉందని, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అండగా ఉంటే విజయాలు వెంటే ఉంటాయని అన్నారు. దేశంలోని వివిధ రాష్ర్టాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. శివ్వంపేట మండలంలోని నవాబ్పేట చెరువును నింపి అక్కడి నుంచి ఇతర చెరువులకు నీళ్లిస్తామని అన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలో ఎన్నో సంక్షేమ పనులు చేయడం జరిగిందని, ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా ఇలా ఎన్నో పథకాలను అమలుచేస్తున్నారన్నారు. వర్షాకాలం వచ్చిందంటే రైతులు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేవారని, కానీ, నేడు రైతుబంధుతో ప్రభుత్వం ఎకరానికి రూ. 10వేలు ఇచ్చి పంట పెట్టుబడి అందిస్తున్నదని వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు మాని అభివృద్ధిని చూడాలన్నారు. ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా భయపడేది లేదని, ఎదుర్కోవడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. తాలుకాలోని గిరిజన తండాల్లో రూ. 56కోట్లతో సీసీరోడ్లు నిర్మించామని, అలాగే, రూ. 82కోట్లతో బీటీరోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ తండాలను అభివృద్ధి చేశారు : కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎంపీ
సీఎం కేసీఆర్ గిరిజన తండాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శివ్వంపేట మండలంలో అనుభవం ఉన్న కార్యకర్తలు ఉన్నారని, వారే బీఆర్ఎస్కి గట్టి పునాదులు అని గుర్తుచేశారు. 2014కు ముందు గిరిజన తండాల్లో పుట్టిన ఆడపిల్లలను అమ్ముకున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అలాంటి పరిస్థితి కనుమరుగైందన్నారు. గ్రామ పంచాయతీల్లో మిషన్భగీరథ నీరు ఇంటింటికీ వస్తున్నాయని, సీసీరోడ్ల నిర్మాణాలు కూడా పూర్తయ్యాయన్నారు. ఎన్నికల సమయంలో ఎంతోమంది నాయకులు వస్తారు కానీ, అభివృద్ధి చేసే నాయకులనే మనం ఎన్నుకోవాలన్నారు. ఇది కేవలం ఎమ్మెల్యే మదన్రెడ్డితోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శివ్వంపేట మండలం నుంచి నాకు మంచి మెజార్జీ ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేకు మంచి మెజార్టీ ఇవ్వాలని కోరారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : యెగ్గె మల్లేశం, మెదక్ జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ
సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఎమ్మెల్సీ, మెదక్ జిల్లా పార్టీ ఇన్చార్జి యెగ్గె మల్లేశం సూచించారు. 2014కు ముందు ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. సీఎం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు అన్ని కుటుంబాలకు అందుతున్నాయన్నారు. అభివృద్ధి పనులను ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఆత్మీయ సమ్మేళనం ముఖ్య ఉద్దేశమన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 50వేల మెజార్టీతో ఎమ్మెల్యే మదన్రెడ్డిని గెలిపించారని, వచ్చే ఎన్నికల్లో కూడా 60వేల మెజార్టీతో విజయానందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా 16సీట్లు గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలకు మహర్దశ : హేమలతాశేఖర్గౌడ్, జడ్పీ చైర్పర్సన్
బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని జడ్పీచైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్కి అండగా కార్యకర్తలు, ప్రజలు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకువచ్చారని ప్రతీ గడపకు సంక్షేమ పథకాలు చేరాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా, జడ్పీ కో ఆప్షన్ మన్సూర్, రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్గుప్తా, పీఏసీఎస్ ఛైర్మన్ వెంకటరాంరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షులు లావణ్యమాధవరెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సుధీర్రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ రవినాయక్, బీఆర్ఎస్కేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, వాకిటి శశిధర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.