సిద్దిపేట అర్బన్/నంగునూరు, మే 3: దేశంలో నిజమైన రైతు నాయకుడు కేసీఆరేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున పంట నష్టపరిహారం అందించడం ఓ రికార్డు అని.. ఏ బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంత మొత్తం పరిహారం అందించలేదన్నారు. పెద్ద మనసుతో రైతులకు సహాయం చేస్తున్న సీఎం కేసీఆర్కు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నానని మంత్రి అన్నారు. నంగునూరు మండల కేంద్రంలో రూ.కోటీ 60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ కార్యాలయం, రూ.కోటీ 20 లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మించిన తహసీల్ ఆఫీస్, ఇరిగేషన్ గెస్ట్హౌస్ను మంత్రి బుధవారం ప్రారంభించారు.
స్థానికంగా రూ.4 కోట్లు ఖర్చు చేసి నిర్మించనున్న నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులకు సైతం ఆయన శంకుస్థాపన చేశారు. అంతకు ముందు మండలంలోని కోనాయపల్లిలో దుద్దెడ-బందారం-కోనాయపల్లి-ముండ్రాయి గ్రామాలను కలుపుతూ రూ.5.15 కోట్ల ఖర్చుతో చేపట్టనున్న డబుల్ లేన్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. తర్వాత కోనాయపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని నర్మెట గ్రామంలో ఉన్న శ్రీరామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, దురదృష్టవశాత్తు వడగండ్ల వర్షంతో పంటలు దెబ్బ తిన్నాయన్నారు. ఇక నుంచి రైతులు ఆలోచించి పంట కాలాన్ని ఒక నెల ముందుకు తీసుకురావాలని, తద్వారా వడగండ్లతో బాధ తప్పుతుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
పక్క రాష్ర్టాల వారు సైతం..
పక్క రాష్ర్టాలవారు సైతం ఇక్కడ బతికేందుకు వస్తున్నారని మంత్రి తెలిపారు. నంగునూరులో చేపట్టిన నాలుగు లేన్ల రహదారి పనులు నాలుగైదు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. కోనాయపల్లి-బందారం రోడ్డు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్కు దూరభారం తగ్గుతుందన్నారు. బక్రిచెప్యాల, నాంచార్పల్లి మీదుగా తోర్నాల వరకు రూ.35 కోట్ల ఖర్చుతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని.. రెండు, మూడు నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసుకుందామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎంపీపీ జాప అరుణాదేవి, జడ్పీటీసీ తడిసిన ఉమావెంకట్రెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్ దిలీప్నాయక్, ఆయిల్ పామ్ రైతు వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కోల రమేశ్గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ బద్దిపడగ కిష్టారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అన్ని రకాలా నంగునూరు అభివృద్ధి..
నంగునూరు మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నామని మంత్రి అన్నారు. మండలంలో రూ.307 కోట్లతో వివిధ అభివృద్ది పనులు చేసుకున్నామని తెలిపారు. రూ.200 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. ఈ ఏడాది నంగునూరు పెద్దవాగులోకి కాళేశ్వరం నీళ్లు అందించామని తెలిపారు. వాగు అవతలి గ్రామాలకు నీళ్లు అందించడానికి ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసుకోనున్నామని, ఆ పనులు త్వరలోనే ప్రారంభమతాయన్నారు. ఆయిల్పామ్ సాగులో నంగునూరు మండలం జిల్లాలోనే ముందంజలో ఉందన్నారు. ఆయిల్పామ్ ఫ్యాక్టరీతో రా బోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఆయిల్పామ్పై రైతు లు శ్రద్ధ పెట్టాలని, సాగుకు అన్ని రకాల సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఇందుకోసం రూ.1000 కోట్లు బడ్జెట్లో కేటాయించిందని వెల్లడించారు.