సిద్దిపేట కమాన్, జూలై 15 : మీ ప్రేమ.. ఆదరాభిమానాలు ఉన్నంత కాలం సేవ చేస్తానని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం లైట్ మోటారు వెహికల్ అసోసియేషన్, భట్రాజ్ సంఘం, మొబైల్ అసోసియేషన్ల భవనాల కోసం స్థలాన్ని మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలను ఆయా సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ సిద్దిపేట అంటే పరిశుభ్రతకు మారు పేరని.. స్వచ్ఛతలో మీరందరూ భాగస్వాములు కావాలని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు.
సిద్దిపేట విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిచి ఆదర్శంగా మారిందని చెప్పారు. స్థలం కేటాయించిన సంఘాలకు త్వరలోనే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. నియోజక వర్గంలో ఇప్పటి వరకు దాదాపు 60 కుల సంఘాలకు స్థలాన్ని ఇవ్వడంతో పాటు భవనాలు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరామ్, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మచ్చ విజితావేణుగోపాల్రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి
సిద్దిపేట టౌన్/అర్బన్, జూలై 15 : సిద్దిపేటలో జరిగిన ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పాల్గొన్నారు. పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద దీకొండ మైసమ్మ ఆలయ బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం 41వ వార్డులోని సత్యసాయిబాబా ఆలయ ఆవరణలో ఆషాఢ మాస తొట్టెల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మంత్రి హరీశ్రావును సన్మానించారు. అదే విధంగా అర్బన్ మండలం ఎల్లుపల్లిలో జరిగిన ఆషాఢ బోనాల ఉత్సవాల్లో మంత్రి పాల్గొని పోచమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు.