సిద్దిపేట, జూన్ 1 : సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఐదు వరుసల రన్నింగ్ ట్రాక్, సింథటిక్ టార్ప్ ఏర్పాటుతో క్రీడాప్రాంగణం రూపురేఖలు మారిపోయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల, జూనియార్ కళాశాలల్లో నిర్మిస్తున్న రన్నింగ్ ట్రాక్, సింథటిక్ టార్ప్, గ్రీన్ టార్ప్పై కలియ తిరుగుతూ కార్నర్ ప్లే గ్రౌండ్ సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహ్లాదకరమైన పార్కు, సింథటిక్ వాకింగ్ ట్రాక్, పనులు పూర్తి కావచ్చాయని, మిగిలిన ప్లాట్ఫామ్, పెయింటింగ్, గేట్ నిర్మాణం, కార్నర్లో ప్లే గ్రౌండ్ చుట్టూ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలన్నారు.
ఈ విద్యాసంవత్సరంలో ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఒకవైపు విద్య, మరోవైపు క్రీడలకు నెలవుగా మారుతుందంటూ మంత్రి తెలిపారు. వాలీబాల్, పుట్బాల్ ఆడేందుకు వీలుగా రన్నింగ్ ట్రాక్ మధ్యలో గ్రీన్ టార్ప్ పూర్తి కాగా, ట్రాక్ చుట్టూ సిట్టింగ్ గ్యాలరీ ఏర్పాటు చేసి మైదానంలో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. మంత్రి వెంట సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, తదితరులు ఉన్నారు.