సిద్దిపేట, డిసెంబర్ 8: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేటలో క్యాంపు కార్యాలయంలో అయ్యప్ప పడిపూజ, భిక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయాలకు సీఎం కేసీఆర్ ఇచ్చినంత ప్రాధాన్యతను దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా ఇవ్వడం లేదన్నారు. సమైక్య పాలనలో చిన్న చూపునకు గురైన ఆలయాలను నేడు అద్భుతమైన రీతిలో సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారన్నారు. ప్రాజెక్టులకు, జోన్లకు, జిల్లాలకు ఆలయాలు, దేవుళ్ల పేర్లు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు.
అయ్యప్పస్వామి కారణజన్ముడు అన్నారు. ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టిన మహిషి అనే రాక్షస మహిళను సంహరించి కోట్లాది మందికి దేవుడయ్యారన్నారు. ఎక్కడో కేరళ రాష్ట్రంలోని 18కొండల ఎగువన వెలసిన అయ్యప్పస్వామి, నేడు మన ఇంటి దేవుడిగా పూజలు అందుకుంటున్నాడన్నారు. మంచి మనసుతో ఆరాధిస్తే సత్ఫలితాలే ఉంటాయనడానికి అయ్యప్ప పూజలే నిదర్శనమన్నారు. నియమ నిష్టలు, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతతకు అయ్యప్ప మాలధారణ ఎంతో దోహద చేస్తుందని తెలిపారు. ఉదయాన్నే 4గంటలకు నిద్రలేచి సూర్యోదయానికి ముందే పూజలు, ఒంటిపూట భోజనం, నల్లటి దీక్షా వస్ర్తాలు, కటిక నేలపై నిద్ర, రోజంతా స్వామి జపంతో 41రోజుల పాటు మండల దీక్ష చేయడం ఆషామాషీ విషయం కాదన్నారు. దీనికి ఎంతో ఓపిక ఉండాలన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే దీక్ష విరమణకు 80 కిలోమీటర్ల పెద్ద పాదం నడిచి శబరి వెళ్లడం మరో ఎత్తు అన్నారు. చిన్న పాదం నడకలో మీకు ఎన్నో ఆటంకాలు ఉన్నా స్వామి దరి చేరుతున్నారన్నారు.
సిద్దిపేటకు ప్రత్యేకత..
సిద్దిపేటకు ఒక ప్రత్యేకత ఉందని మంత్రి హరీశ్రావు అన్నారు. చాలా ప్రాంతాల్లో ఒక్కో దీక్ష మాత్రమే చేపతారన్నారు. కానీ, సిద్దిపేటవాసులు హనుమాన్, అయ్యప్ప దీక్షలు సైతం ఎక్కువ మంది చేపడతారని తెలిపారు. హనుమాన్ దీక్ష సమయంలో ఎటుచూసిన కాషాయ వస్ర్తాలు ధరించిన స్వాములే కనిపిస్తారని చెప్పారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో నల్ల వస్ర్తాలు ధరించిన అయ్యప్పస్వాములు దర్శనమిస్తున్నారని తెలిపారు. ఇంకా దుర్గామాత దీక్ష, గణేశ్ దీక్ష, వేణుగోపాలస్వామి దీక్షలు ఈ ప్రాంత భక్తులు పాటిస్తున్నారన్నారు. సిద్దిపేట ప్రజలు పూజించని దేవుడు లేడని, పాటించని దీక్ష లేదంటే అతిశయోక్తి కాదన్నారు. ఈ ఆధ్యాత్మిక కారణంగానే నేడు సిద్దిపేట ప్రాంతం అభివృద్ధిలో విలసిల్లుతున్నదని తెలిపారు. ఇటీవల పట్టణంలో 14 రోజుల పాటు కాలచక్ర యాగం కనుల పండుగగా నిర్వహించుకున్నట్లు చెప్పారు. సంకల్ప సిద్ధిగల ప్రాంతం మన సిద్దిపేట, సకల దీక్షలకు ప్రసిద్ధి ఈ ప్రాంతం, అయ్యప్పస్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి హరీశ్రావు అన్నారు.