మెదక్ జిల్లా చేగుంటలో కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ దుకాణాల సముదాయాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి.. ఇందాకే కొత్త బడ్జెట్ ప్రవేశ పెట్టి ఇక్కడకు వచ్చాను. వచ్చే ఏడాదిలో ప్రభుత్వం మీకు ఏ రకంగా సేవ చేస్తుంది అనేది చెప్పాము. ఈ సారి బడ్జెట్లో సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారి కోసం రు.3 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదించాం. ఈ ఏడాది నియోజకవర్గానికి 3000 ఇళ్లు, వచ్చే ఏడాది 3000 ఇళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు.
57 ఏళ్లు దాటగానే పింఛన్లు ఇస్తామని చెప్పాం. రాష్ట్రంలో 38 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. వచ్చే ఉగాది తర్వాత కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రతిపాదించాం. బాలింతల్లో రక్త హీనత సమస్య నివారించేందుకు కేసీఆర్ న్యుట్రిషన్ కిట్ను పంపిణీ చేయాలని ప్రతిపాదించాం. ప్రజల ఆకాంక్షల గీటు రాయిగా ప్రభుత్వం పని చేస్తున్నది. మేము ప్రజల సంక్షేమం కోసం పని చేస్తే ఢిల్లీలోని ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తున్నది. యూపీ ఎన్నికలు కాగానే మళ్లీ గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారట. జుటా మాటల బీజేపీ వ్యవహారాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అన్నం పెట్టే చేయి ఏదో.. సున్నం పెట్టే చేయి ఏదో ప్రజలు గుర్తించాలి. సున్నం పెట్టే చేతులకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలి అని చెప్పిన మంత్రి హరీశ్ రావు.. మహిళా దినోత్సవం పురస్కరించుకొని కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.