అందోల్/చేర్యాల/అక్కన్నపేట, మార్చి 21: కాలగమనంలో మరో తెలుగు సంవత్సరం గడిచిపోయింది. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన శుభకృత్ సంవత్సరం, శోభకృత్ నామ సంవత్సరానికి స్వాగతిస్తూ వెళ్లిపోయింది. ఈ పర్వదినం తమ జీవితాల్లో కోటి కాంతులు నింపాలని కోరుకుంటూ, వసంతాగమనంతో పచ్చదనం పులుముకున్న ప్రకృతి కాంత, కోయిలమ్మలై కూసే వేళ, ఉగాది పచ్చడితో షడ్రుచులను ఆస్వాదించి, రాబోయే సుఖసంతోషాలు, కష్టసుఖాలను ఎదుర్కొనేందుకు జిల్లా ప్రజానీకం సిద్ధమైంది. బుధవారం ఉగాది పర్వదినం పురస్కరించుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పంచాంగ పఠనాలు, పచ్చళ్ల పంపిణీ మధ్య ధార్మిక కార్యక్రమాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పంచాంగ శ్రవణం చేయాలి…
ఉగాది రోజు ముఖ్యమైన ఆచారం పంచాంగ శ్రవణం. తిథి, వార, యోగ, కరణం ఫలితాలను తెలుసుకుంటే గంగాస్నానం ఫలం కలుగుతుంది. భూమిని, బంగారాన్ని, గోవులను, ఏనుగులను మొదలైన వాటిని దానమిస్తే కలిగే ఫలం పంచాంగ శ్రవణంతో దక్కుతుంది.
-నాగిళ్ల లక్ష్మాణామూర్తి, పండితుడు, అంతకపేట
జిల్లా ప్రజలకు ప్రముఖుల శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు పలువురు ప్రముఖులు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో శోభాయమానంగా ఉండాలి. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారులో అన్ని వర్గాల ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వారు పేర్కొన్నారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఉన్నారు.
శోభకృత్లో శోభ వెల్లివిరియాలి
తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలి. ఉగాది పచ్చడిలాగే అందరి జీవితం షడ్రుచుల సంగమంగా మారాలి. తెలుగువారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శ్రీశోభకృత్ అంతా శోభాయమానంగా విరాజిల్లాలి. ప్రభుత్వం అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాధించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం సంతృప్తినిచ్చింది. ఈ ఏడు కాలంతో ప్రమేయం లేకుండా కాళేశ్వరం జలాలతో కాల్వలు, చెరువులు, కుంటల్లో నీళ్లు సమృద్ధిగా నిండి ఉన్నాయి. మండుటెండల్లో చెక్డ్యాంలు, వాగుల్లో జలసిరులు చూస్తున్నాం. రైతులు ఆనందంతో పాడిపంటలతో వర్ధిల్లాలి. అన్నింటా శుభం జరగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. కొత్త సంవత్సరం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలి.
-మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ