HomeMedakMinister Harish Rao Flags Off Siddipet Half Marathon
సాగర తీరం.. జన సందోహం
ప్రతి సంవత్సరం ఆగస్టు 6వ తేదీన హాఫ్ మారథాన్ నిర్వహిస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. సిద్దిపేట ఏ రంగంలోనైనా ఆదర్శంగా ఉండాలన్నదే తన తపన అన్నారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ప్లాస్టిక్ రహిత హాఫ్ మారథాన్ నిర్వహించామని.. ఇది సిద్దిపేటకే గర్వకారణమని మంత్రి అన్నారు.
హాఫ్ మారథాన్ అదుర్స్
ఉత్సాహంగా పాల్గొన్న యువత
పెద్దసంఖ్యలో హాజరైన అథ్లెట్లు
సందడిగా మారిన రంగనాయకసాగర్
ప్లాస్టిక్ రహితంగా కొనసాగిన హాఫ్ మారథాన్
జెండా ఊపి రన్ను ప్రారంభించిన మంత్రి
ఏటా ఆగస్టు 6న హాఫ్ మారథాన్ నిర్వహిస్తాం
ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు
రంగనాయకసాగర్ కట్ట జనసంద్రమైంది. హాఫ్ మారథాన్ అదుర్స్ అనిపించింది. జిల్లా కేంద్రంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై ఆదివారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు హాఫ్ మారథాన్ను జెండాఊపి ప్రారంభించారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి అథ్లెట్లు రన్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రి హరీశ్రావు సహకారంతో జిల్లా పోలీస్ శాఖ, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన హాఫ్ మారథాన్కు విశేష స్పందన లభించింది. 6వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వేలమంది పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన హోస్ట్లు నృత్యాలు చేపిస్తూ యువతను ఉత్సాహ పర్చారు. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా అన్ని వయసుల వారు రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు మంత్రి హరీశ్రావు, సీపీ శ్వేత బహుమతులు అందజేశారు.
– సిద్దిపేట/ సిద్దిపేట అర్బన్, ఆగస్టు 6
సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, ఆగస్టు 6: ప్రతి సంవత్సరం ఆగస్టు 6వ తేదీన హాఫ్ మారథాన్ నిర్వహిస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. సిద్దిపేట ఏ రంగంలోనైనా ఆదర్శంగా ఉండాలన్నదే తన తపన అన్నారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ప్లాస్టిక్ రహిత హాఫ్ మారథాన్ నిర్వహించామని.. ఇది సిద్దిపేటకే గర్వకారణమని మంత్రి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగనాయక సాగర్ కట్టపై జరిగిన హాఫ్ మారథన్ను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం రన్లో గెలిచిన విజేతలను శాలువాతో సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన సిద్దిపేట స్పోర్ట్స్ హబ్గా ఇలాంటి కార్యక్రమాల స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. నేడు సరికొత్త కార్యక్రమానికి వేదిక అయిన సిద్దిపేట పరుగుల సందడిగా మారిందన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్దిపేట వేదిక అయిందని.. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో స్విమ్మింగ్ పోటీలు, వాలీబాల్, ఫుట్బాల్ పోటీలు జరగడంతో పాటు జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సిద్దిపేట వేదికైందన్నారు. రంగనాయక సాగర్ వేదికగా రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. హాఫ్ మారథాన్ కార్యక్రమాన్ని ప్రకటించినప్పటి నుంచే అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి పునాది వేసిన సీపీ శ్వేతను మంత్రి హరీశ్రావు అభినందించారు.
స్వచ్ఛ, ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా హాఫ్ మారథాన్
సిద్దిపేటలో ఉన్న పరిశుభ్రత, పచ్చదనం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రపంచానికి చూపించాలన్నదే తమ ప్రయత్నమని సీపీ శ్వేత అన్నారు. స్వచ్ఛ సిద్దిపేట, ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఎలాంటి ప్లాస్టిక్ ఉపయోగించకుండా హాఫ్ మారథన్ నిర్వహించేందుకు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టీల్ బ్యాంక్ను ఉపయోగించుకొని ప్లాస్టిక్ రహిత రన్ నిర్వహించినట్లు తెలిపారు. భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ.. పెద్ద పెద్ద నగరాల్లో నిర్వహించే హాఫ్ మారథాన్ కంటే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో రంగనాయకసాగర్ రిజర్వాయర్పై రన్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మంత్రి హరీశ్రావు కృషితో సిద్దిపేటలో ప్రారంభమైన ఈ హాఫ్ మారథాన్ను అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్లో కూడా కొనసాగించి ప్రతి సంవత్సరం హాఫ్ మారథాన్ను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురామ్, జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరామ్, ఎంపీపీ మాణిక్యరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం హాఫ్ మారథాన్
ఆరోగ్యమే మహాభాగ్యమని.. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఇలాంటి రన్లు ఎంతగానో ఉపయోగపడుతాయని మంత్రి హరీశ్రావు అన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రమే నిర్వహించే ఈ రన్ను ప్రతి సంవత్సరం ఆగస్టు 6వ తేదీన సిద్దిపేటలో నిర్వహిస్తామని వెల్లడించారు. నేడు జరిగిన హాఫ్ మారథాన్ పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా నిర్వహించడం జరిగిందన్నారు. సిద్దిపేట హాఫ్ మారథాన్ బ్రాండ్ అంబాసిడర్స్ తాడూరి శ్రీకాంత్, డాక్టర్ నాగలక్ష్మి ఇద్దరూ అద్భుతమైన ప్రచారకులుగా నిలిచి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ నేచర్ క్యూర్ దవాఖాన వైద్యురాలు నాగలక్ష్మి 100 కి.మీ సైక్లింగ్ చేసుకుంటూ వచ్చి ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపగా.. సిద్దిపేట జిల్లాకు చెందిన శ్రీకాంత్ తన మిత్ర బృందంతో కలిసి 100 కి.మీ పరుగెత్తి యువకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారన్నారు.
విజేతలు వీరే…
హాఫ్ మారథాన్లో గెలుపొందిన విజేతలకు మూడు విభాగాల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా బహుమతులు అందజేశారు. ఇందులో భాగంగా 21కే మహిళల విభాగంలో సూర్యాపేటకు చెందిన ఉమ ప్రథమ బహుమతి (రూ.50 వేలు), ద్వితీయ బహుమతి నల్లగొండకు చెందిన మల్లిక (రూ.25 వేలు), తృతీయ బహుమతి నవ్య(రూ.10 వేలు), 21కే పురుషుల విభాగంలో ప్రథమ బహుమతి రమావత్ రమేశ్చంద్ర (రూ.50 వేలు), ద్వితీయ బహుమతి ఉత్తరప్రదేశ్కు చెందిన మోతీ చౌదరి(రూ.25 వేలు), తృతీయ బహుమతి నాగర్కర్నూల్కు చెందిన గీయో ఆంటోని (రూ.10 వేలు) గెలుచుకున్నారు. 10కే రన్ మహిళల విభాగంలో ప్రథమ బహుమతి నారాయణఖేడ్కు చెందిన స్వప్న (రూ.25 వేలు), ద్వితీయ బహుమతి మంచిర్యాలకు చెందిన కావ్య(రూ.15 వేలు), తృతీయ బహుమతి గగనశ్రీ(రూ.10 వేలు), పురుషుల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సునీల్కుమార్(25 వేలు), ద్వితీయ బహుమతి మహారాష్ట్రకు మనీశ్ (రూ.15 వేలు), తృతీయ బహుమతి నల్లగొండకు చెందిన మహేశ్(రూ.10 వేలు) గెలుపొందారు. 5కే రన్లో మహిళల విభాగంలో ప్రథమ బహుమతి హైదరాబాద్కు చెందిన విశాలాక్షి (రూ.15 వేలు), ద్వితీయ బహుమతి బీదర్కు చెందిన కృష్ణకుమారి(రూ.10 వేలు), తృతీయ బహుమతి నల్లగొండకు చెందిన ఆర్.కీర్తన(రూ.5 వేలు), పురుషుల విభాగంలో ప్రథమ బహుమతి అఖిల్(రూ.15 వేలు), ద్వితీయ బహుమతి రాంరెడ్డి(రూ.10 వేలు), తృతీయ బహుమతి తిలక్ (రూ.5 వేలు) గెలుపొందారు. రన్నర్స్కు మంత్రి హరీశ్రావు, సీపీ శ్వేత చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఉత్సాహంగా హాఫ్ మారథాన్
హాఫ్ మారథాన్ ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా జరిగింది. సిద్దిపేట జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ర్టాలు, జిల్లాల వారు హాఫ్ మారథాన్లో పాల్గొన్నారు. మంత్రి హరీశ్రావు సహకారంతో సిద్దిపేట జిల్లా పోలీస్ శాఖ, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన హాఫ్ మారథాన్కు విశేష స్పందన లభించింది. 21కే, 10కే, 5కే రన్లో మొత్తం నాలుగు వేలకు పైగా రన్నర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రంగనాయకసాగర్ కట్ట జనసంద్రాన్ని తలపించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన హోస్ట్లు యువతను నృత్యాలు చేయిస్తూ ఉత్సాహాన్ని నింపారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారు రన్లో పాల్గొని ఉల్లాసంగా గడిపారు.
ప్లాస్టిక్ రహితంగా..
సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన హాఫ్ మారథాన్ ఒక ప్రత్యేకత ఉంది. మొత్తం ఈవెంట్లో ఎక్కడా కూడా ప్లాస్టిక్ను ఉపయోగించకుండా నిర్వహించారు. ప్లాస్టిక్ రహితంగా హాఫ్ మారథాన్ నిర్వహించాలనే ఒక సంకల్పంతో ముందడుగు వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే స్వచ్ఛ, ఆరోగ్య సిద్దిపేటగా పేరుగాంచిన సిద్దిపేట ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ రహిత హాఫ్ మారథాన్ నిర్వహించినట్లు మంత్రి హరీశ్రావు, సీపీ శ్వేత తెలిపారు.
నిర్వాహకులకు ధన్యవాదాలు
ఇప్పటి వరకు 50కి పైగా మారథాన్లో పాల్గొన్నా . ఇక్కడ అద్భుతమైన వాతావరణంలో హాఫ్ మారథాన్ నిర్వహించారు. ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, హైదరాబాద్లో జరిగిన మారథాన్ పాల్గొన్నా. ఇప్పటి వరకు అన్ని మారథాన్లో 30సార్లు మొదటి, రెండో స్థానంలో నిలిచా. ఇక్కడ నేను ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉన్నది. వచ్చే అక్టోబర్ 15న ఢిల్లీలో జరిగే మారథాన్ కోసం సిద్ధమవుతున్నా. ఇక్కడ ఏర్పాట్లు చేసిన మంత్రి హరీశ్రావు, నిర్వాహకులకు ధన్యవాదాలు.
– ఆర్.రమేశ్చంద్ర, అచ్చంపేట
సంతోషంగా ఉంది..
తొలిసారిగా నేను హాఫ్ మారథాన్లో పాల్గొన్నా.. ఇందులో మొదటి స్థానంలో నిలవడం సంతోషంగా ఉన్నది. రంగనాయకసాగర్ ప్రాజెక్టుపై ఆహ్లాదకరమైన వాతావరణంలో హాఫ్ మారథాన్ నిర్వహించడం ఆనందంగా ఉన్నది. ఏర్పాట్లు బాగున్నాయి. మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-అఖిల్, ఉత్తరప్రదేశ్
అద్భుతమైన ఏర్పాట్లు
హాఫ్మారథాన్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చా.. ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి. ఇప్పటి వరకు 15 మారథాన్లో పాల్గొన్నా. కానీ ఇక్కడ అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉన్నది. మళ్లీ వచ్చే మారథాన్లో పాల్గొనేందుకు తప్పకుండావస్తా. అందరికీ ధన్యవాదాలు.
-సునీల్కుమార్, మహారాష్ట్ర
ఏర్పాట్లు చాలా బాగున్నాయి
జాతీయ స్థాయి హాఫ్ మారథాన్లో పాల్గొన్నా.. రోజూ ఉదయం రెండు గంటలు, సాయంత్రం గంట నిత్యం
ప్రాక్టీస్ చేస్తా.. సిద్దిపేట హాఫ్ మారథాన్ మంచి వాతావరణంలో నిర్వహించారు. రన్నర్ల కోసం చేసిన ఏర్పాట్లు బాగున్నాయి. ప్రథమ స్థానం రావడం సంతోషంగా ఉన్నది.
-ఎం.ఉమ, నూతనకల్ మండలం, సూర్యాపేట జిల్లా
పది సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నా
ఇప్పటి వరకు నేను 100పైగా మారథాన్లో పాల్గొన్నా . సిద్దిపేట జిల్లాలో పాల్గొనడం సంతోషంగా ఉన్నది. నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. పట్టణం అద్భుతంగా ఉన్నది. పదేండ్లుగా నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నా. 2018లో బ్యాంకాక్లోని పటాయ మారథాన్లో వెండి పథకం సాధించా. ఇక్కడ మూడో స్థానం రావడం సంతోషంగా ఉన్నది.