సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 10: రూ.25 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీని ఉత్తరాదికి తరలించి, కేవలం రూ.500 కోట్ల వ్యాగన్ ఫ్యాక్టరీని తెలంగాణకు ఇచ్చారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డిలో నిర్వహించిన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన ప్రభుగౌడ్, వైస్ చైర్మన్ ఖాజాఖాన్, డైరెక్టర్లను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కు తరలించారన్నారు. లడ్డూ దక్కాల్సిన చోట పిప్పర్మెంట్ ఇచ్చినట్లు ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వానికి దక్షిణ భారతంపై ఉన్నది కేవలం సవతి తల్లి ప్రేమేనన్నారు. తెలంగాణకు ప్రధాని చేసిందేమీ లేదన్నారు. రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయం గురించి స్థానిక నాయకులు తెలుసుకోవాలన్నారు. బయ్యారం, ఉక్కు కర్మాగారం, కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఏపీలో కలిపిన ఏడు మండలాలను అడగాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఢిల్లీకి గులాంగిరి చేసేందుకే ఉన్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ మాటలే తప్ప చేతల్లేవన్నారు. ఇంతకాలం పని చేసిన కాంగ్రెస్ రైతు బంధు, రైతు బీమా లాంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. దేశంలో అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కేవలం రూ.600 పింఛన్ ఇస్తున్నారని, తెలంగాణలో రూ.4 వేలు ఇస్తామనడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ముందు అక్కడ రూ.4 వేల పింఛన్ అమలు చేసి, మాట్లాడాలని హితవు పలికారు. కర్ణాటకలో ఉచిత కరెంట్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని, అందుకే మీది ఫేక్ అని కాంగ్రెస్, బీజేపీలను తూర్పారబట్టారు. సీఏం కేసీఆర్ది తెలంగాణ ప్రజలతో ఉన్నది పేగు బంధమన్నారు. కాంగ్రెస్, బీజేపీలది ఫేక్ బంధమని, పేకమేడల్లాంటి బంధమన్నారు. ప్రజలు ఆ పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరని, బీఆర్ఎస్దే ప్రభంజనమని స్పష్టం చేశారు.
రూ.427 కోట్లతో 3.84 లక్షల ఎకరాల సాగునీరు
తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ దూరదృష్టితోనే సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. తెలంగాణలోని ప్రాంతాలపై కేసీఆర్కు పూర్తి అవగాహన ఉన్నదన్నారు. సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. రూ.427 కోట్లతో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయన్నారు. ప్రాజెక్టులు పూర్తైతే జిల్లాలో 3.84 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ రావడం కేసీఆర్తోనే సాధ్యమయ్యిందన్నారు. ఎన్నో అద్భుత కార్యక్రమాలు బీఆర్ఎస్ అమలు చేస్తున్నదని గుర్తు చేశారు.
కష్టపడి పని చేసే కార్యకర్తలను కాపాడుకుంటాం
పార్టీ కోసం పని చేస్తున్న నాయకులు, కార్యకర్తలు చాలా మంది ఉన్నారని, పార్టీ కోసం కృషి చేస్తున్న నాయకులను అక్కున చేర్చుకుంటామని మంత్రి భరోసానిచ్చారు. ఇంకా కొంతమందికి రావాల్సిన పదవులు వస్తాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు తీపి కబురందించారు. త్వరలో అందరికీ న్యాయం చేస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీకి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ డాక్టర్ శరత్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ ప్రభు గౌడ్, మాజీ సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీటీలు పాల్గొన్నారు.
ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలి
జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ మంజీరా స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్రావుకు వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలు ఉన్నాయని, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లు ఉన్నప్పటికీ క్రీడలకు లోటు ఏర్పడిందని స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ఉత్తర్పల్లి మాణయ్య అన్నారు. గతంలో సంగారెడ్డిలో స్పోర్ట్స్ అకాడమీలు ఉన్నందున ఇక్కడి నుంచి ఎంతో మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి తమ ప్రతిభను చాటారని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియం, 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో పీడీలు మచ్చేందర్, మల్లయ్య, బుచ్చయ్య తదితరులు ఉన్నారు.