సదాశివపేట, నవంబర్ 23 : ప్రజలు సేవ చేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్తో కలిసి మంత్రి హరీశ్రావు బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ నుంచి బసవేశ్వర చౌక్ మీదుగా గాంధీచౌక్ వరకు రోడ్ షో నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో మంత్రి హరీశ్రావుకు స్వాగతం పలికారు. అనంతరం గాంధీచౌక్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ గత సాధారణ ఎన్నికల్లో చింతాప్రభాకర్ ఓడిపోయినా ప్రజల్లోనే ఉన్నాడని గుర్తు చేశారు. కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోవద్దన్నారు.
ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్కే పరిమితయ్యారని గుర్తు చేశారు. టూరిస్ట్ వ్యక్తిలా సంగారెడ్డికి అప్పుడప్పుడు వచ్చే జగ్గారెడ్డి కావాలా? నిత్యం ప్రజల మధ్యే ఉండే చింతా ప్రభాకర్ కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. సదాశివపేట అభివృద్ధికి జగ్గారెడ్డి చేసిందేమీలేదన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే జగ్గారెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 60 ఏండ్లలో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ చేసి చూపించిందన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ యాద మ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, బీఆర్ఎస్ నాయకుడు రాజేశ్వర్రావు దేశ్పాండే, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చీల మల్లన్న, ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం, కార్యకర్తలు పాల్గొన్నారు.