మెదక్, జనవరి 24 : మీ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారా..? ఎవరికైనా జలుబు, దగ్గు, ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయా..? రుచి, వాసన తెలుస్తున్నాయా..? ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారా..? ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే చేస్తున్న సిబ్బంది ప్రజల నుంచి ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. మెదక్ జిల్లాలో ఇంటింటా జ్వర సర్వే జోరుగా సాగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనాను కట్టడి చేసేందుకు జిల్లా అధికారులు పట్టణంతో పాటు గ్రామాల్లో చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు రోజులుగా సర్వే బృందాలు ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇంటింటా తిరుగుతూ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. గ్రామాలతో పాటు పట్టణాల్లో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలతో పాటు పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల్లో 9,526 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారికి హోం ఐసొలేషన్ మెడికల్ కిట్లు అందించి ఇంటి వద్దే ఉండే విధంగా ధైర్యం చెబుతున్నారు.
1,41,596 ఇండ్లల్లో సర్వే..
మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలతో పాటు నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. సర్వే చేసేందుకు జిల్లాలో 632 బృం దాలను నియమించగా, ఒక్కో బృందం ప్రతిరోజూ 30 నుంచి 40 ఇండ్లలో సర్వే చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మూడు వార్డులకు ఒక సూపర్వైజర్ను నియమించగా, గ్రామాల్లో ఆయా మండలాల ఎంపీడీవోలు నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో నాలుగు రోజులుగా 1,41,596 ఇండ్లల్లో సర్వే నిర్వహించారు. ఇందులో 9,526 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారికి కిట్లను అందజేశారు.
ఇంటింటా సర్వేకు ప్రజలు సహకరించాలి
జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో జరుగుతున్న ఇంటింటా జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలి. బృందాలు ఇంటికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని బృందానికి తెలపాలి. కరోనా లక్షణాలు ఉన్న వారికి వెంటనే మెడికల్ కిట్లు అందజేస్తున్నాం. జిల్లాలో నాలుగు రోజులుగా 1,41,596 ఇండ్లల్లో జ్వర సర్వే నిర్వహించాం. ఇందులో 9,526 మందికి కిట్లను పంపిణీ చేశాం.
-డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్వో మెదక్