-జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్
మెదక్, సెప్టెంబర్13 : వివిధ బ్యాంకులకు కేటాయించిన యూనిట్లను గ్రౌండ్ అయ్యేలా చూడాల్సిందిగా బ్యాంకర్లకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2017-18 నుంచి 2020-21 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర పథకాలకు సంబంధించి బ్యాంకులకు సబ్సిడీ నిధులు వచ్చినా పథకాలు గ్రౌండ్ కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆమోదమో లేదా తిరస్కరించడమో చేయాలని, పెండింగ్లో పెట్టుకోరాదని హితవు పలికారు.
జిల్లా పరిశ్రమల కేంద్రం, కేవీఐసీ కింద పెండింగ్లో ఉన్న 29 యూనిట్లను ఈ నెల 30లోగా గ్రౌండ్ అయ్యేలా చూడాలన్నారు. వ్యవసాయ రంగంలో పంట రుణాలు, టర్మ్ లోన్లు అందించడంలో చాలా బ్యాంకులు వెనుకబడ్డాయని, సకాలంలో రుణాలు అందించి రైతులను ఆదుకోవాలని సూచించారు. రైతులు బకాయిపడ్డ రుణ వివరాలను మండలాల వారీగా జిల్లా వ్యవసాయాధికారికి అందిస్తే ప్రత్యేక కార్యక్రమం ద్వారా రికవరీకి చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లకు ఆమె భరోసా ఇచ్చారు. డీఆర్డీవో కార్యక్రమాన్ని సమీక్షిస్తూ జిల్లాలో 10,761 స్వయం సహాయక సంఘాలకు రూ.386 కోట్లు అందించాలనే లక్ష్యం కాగా, కేవలం 31.5 శాతం లక్ష్యం సాధించామని, బ్యాంకుల నియంత్రణ అధికారులు లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు.
సూక్ష్మ ఆహార శుద్ధి పథకం కింద పంపిన 9 ప్రతిపాదనలు గ్రౌండ్ అయ్యేలా చూడాలన్నారు. వీధి వ్యాపారాలకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంకా 1700 పెండింగ్లో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే ఈ కార్యక్రమంలో లబ్ధిదారులందరికీ తక్షణమే రుణాలు మంజూరు చేయాలని కోరారు. యూనిట్లు గ్రౌండింగ్ అయిన వాటికి యు.సీలు, ఫొటోలు పంపాలని అన్నారు.
పందిరి సాగుకు వచ్చిన 40 యూనిట్లను గ్రౌండ్ చేయాలన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులకు ఈ నెల 30లోగా బీమా కల్పించి ధ్రువపత్రాలు అందజేయాలని సూచించారు. గ్రామీణ స్వయం ఉపాధి హామీ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఎస్బీఐ వారు వృత్తి నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇస్తున్నారని వివిధ సంక్షేమ శాఖల అధికారులు శిక్షణ అవసరమైన లబ్ధిదారులను గుర్తించాలని వారికి మెదక్ పట్టణంలోనే శిక్షణ ఇప్పిస్తామని అన్నారు.
జిల్లాలో వృత్తి నైపుణ్యం పెంపొందించుటకు 35 మంది లబ్ధిదారులకు ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. ఈ సమావేశంలో నాబార్డు డీడీఎంలు సెసిల్తిమోతీ, జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి వేణుగోపాల్రావు, డీఆర్డీవో శ్రీనివాస్, డీఏవో పరశురాంనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, బీసీ సంక్షేమాధికారి జగదీశ్, డీటీడబ్ల్యూవో ఫిరంగి, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ అదనపు పీడీ బీమయ్య, వివిధ బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.