సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 12 : పంచాయతీ అవార్డుల పోటీల్లో పాల్గొనేందుకు గ్రామ పంచాయతీల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నామని కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డుల పోటీల్లో పాల్గొనేందుకు గ్రామ పంచాయతీల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 31 లోగా స్వీకరించనున్నట్లు వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నేషనల్ పంచాయతీ అవార్డు కార్యక్రమంపై జిల్లా, మండల స్థాయి పనితీరు అంచనా కమిటీలను ఏర్పాటు చేసి వారికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలు ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించారు. 9 కేటగిరీల్లో అవార్డులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు గ్రామ పంచాయతీ స్థాయిలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 9 కేటగిరీల వారీగా గుర్తించనున్నట్లు తెలిపారు.
9 కేటగిరీల్లో 2021-22కు గానూ పూర్తి సమాచారంతో ఎంపీడీవోలకు అందజేయాలన్నారు. దరఖాస్తు సందర్భంగా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలు, అంశాల వారీ గా వివరాలను సంబంధిత అధికారులకు అవగాహన కల్పించారు. పోటీల్లో గెలుపొందిన పంచాయతీలకు ఏప్రిల్ 24న అవార్డుల పంపిణీ ఉంటుందన్నారు.
9 కేటగిరీలు : పేదరికం లేని మెరుగైన జీవనోపాధి, ఆరోగ్యకరమైన పంచాయతీ, బాలల స్నేహపూర్వక పంచాయతీ, నీటి సమృద్ధి గల పంచాయతీ, పరిశుభ్రమైన, పచ్చదనం, స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, మంచి పరిపాలన, మహిళా స్నేహపూర్వక పంచాయతీలుగా మొత్తం 9 కేటగిరీల్లో పోటీలకు ప్రతి పంచాయతీ పాల్గొనాలని కలెక్టర్ సూచించారు.
ఉత్తమ వాటిల్లో 3 అవార్డులను ఎంపిక చేసి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఎంపిక చేయనున్నట్లు వివరించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వాటిని రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అవార్డుల పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో మండల స్థాయిలో శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, జిల్లాఅధికారులు, డీఎల్పీవోలు, ఎంపీవో లు, ఎంపీడీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.