మెదక్/సిద్దిపేట టౌన్/సంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 7 : సోషల్ మీడియాను వేదిక చేసుకొని మత విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు పెడితే పోలీసులు ఊరుకోవడం లేదు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క అన్న చందగా పోలీసులు తమ పంథాను మార్చారు. మంచి, సందేశాత్మక పోస్టుల వరకు ఓకే, గీత దాటారో కొరడా ఝళిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పోలీసులు ఈ అంశాలపై సిద్దిపేట పోలీసు కమిషనరేట్లో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ పోలీసులు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు.
పోస్టులు పెట్టే వారిపై సైబర్ కేసులు…
సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన కేసులు ఇప్పటి వరకు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అయినప్పటికీ ముందస్తుగా పోలీసులు వివిధ అంశాలపై ప్రజలకు వివరిస్తున్నారు. సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల్లో విద్వేషపూరిత, అసభ్య పదజాలంతో ఏవైనా పోస్టులు పెట్టినా, ఫొటోలు మార్ఫింగ్ చేసినా, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని నేరాలు చేస్తే, సోషల్ మీడియాలో అసత్యాన్ని ప్రచారం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు. అసభ్యకరమైన మెసేజ్లు, ఒకరిని కించపరిచే విధంగా కుల, మత రాజకీయ పరమైన మెసేజ్లు పోస్టు చేయడంతో గొడవలకు ఆస్కారం ఉన్నైట్లెతే అలాంటి మెసేజ్లు చేసే వ్యక్తులపై ఐటీ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. అసత్య, దుష్ప్రచారం, అవాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవని, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి మెసేజ్లు పెడితే వారిపై పీడీ యాక్టు కేసు నమోదుకు పోలీసులు వెనుకాడడం లేదు.
సిద్దిపేట జిల్లాలో…
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నేర కార్యకలాపాలకు పాల్పడే వారిపై సిద్దిపేట పోలీసులు నిఘా పెట్టనున్నారు. వారిని అనుక్షణం గమనిస్తూ హద్దులు దాటే వారిని వెంటనే పట్టుకునేందుకు సిద్దిపేట పోలీసు కమిషనరేట్లో ప్రత్యేకంగా సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ 7901100 100 నంబరును ఏర్పాటు చేశారు. పోలీస్ అధికారులు, సిబ్బంది మానిటరింగ్ సెల్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా తప్పుడు ప్రచారాలు గమనించినా, ఎదుర్కొన్నా వెంటనే ఫోన్ చేసి సమాచారం ఇస్తే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు.
మెదక్ జిల్లాలో…
జిల్లాలో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ 7901147112 నెంబర్ను పోలీస్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ విభాగాన్ని నిరంతరం పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే, అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సోషల్ మీడియాను పరిశీలిస్తున్నారు. ఐబీ పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో…
సోషల్ మీడియాలో రోజు వారీగా వచ్చే పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు సంగారెడ్డి జిల్లాలో ప్రతి పోలీస్స్టేషన్లో టెక్నికల్ టీమ్లు పనిచేస్తున్నాయి. ఎస్బీ డీఎస్పీ పర్యవేక్షణలో ఈ బృందాలు అలర్ట్గా ఉన్నాయి. దూషణలు, ఫొటోలు మార్ఫింగ్ చేసి కామెంట్లు పెట్టడం లాంటివి చేస్తే ఎంతటి వారైనా కేసులు నమోదు చేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం వెనుకాడడం లేదు. సోషల్ మీడియాలో చేసిన ఫొటో మార్ఫింగ్పై జిల్లాలోని చౌటకూర్ మండలం శివ్వంపేటలో ఇటీవల మొదటి కేసు నమోదైంది.
అవగాహన కల్పిస్తున్నాం.. కఠిన చర్యలు తప్పవు..
సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సిద్దపేట పోలీస్ కమిషనరేట్లో ఇప్పటికే ఈ అంశాలపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. జాతీయ సమగ్రత, భద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేదిగా ఉన్న వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. అందుకనుగుణంగానే ప్రత్యేకంగా సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేశాం. తమ దృష్టికి వచ్చిన తప్పుడు పోస్టులు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న వాటిని ఎవరైనా సోషల్ మీడియాలో చూస్తే సమాచారం ఇవ్వాలి. పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం ఈ మానిటరింగ్ సెల్ను పర్యవేక్షిస్తున్నారు.
– శ్వేత, పోలీసు కమిషనర్, సిద్దిపేట