దుబ్బాక, ఫిబ్రవరి 6 : సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ‘చెల్లాపూర్’ ఇంతకు ముందు గ్రామపంచాయతీగా ఉండేది. కొన్నేండ్ల క్రితం దుబ్బాక మున్సిపాలిటీగా ఏర్పడడంతో పక్కనే ఉన్న ఈ గ్రామం కొత్త మున్సిపాలిటీలో విలీనమైంది. గతంలో గ్రామంలో సర్కారు బడి లేకపోవడంతో ఇక్కడి విద్యార్థులు కాలిబాటన దుబ్బాకకు వెళ్లి చదువుకునేవారు. దాదాపు 60 ఏండ్ల క్రితం చెల్లాపూర్కు ప్రాథమిక పాఠశాల మంజూరైంది. అయితే, పాఠశాల నిర్మించేందుకు స్థలం లేకపోవడంతో అమ్మన బాల్రెడ్డి అనే రైతు తన వద్ద ఉన్న వ్యవసాయ భూమిలో నుంచి ఎకరం స్థలాన్ని పాఠశాలకు విరాళంగా ఇచ్చాడు. దీంతో ఆ స్థలంలో పాఠశాలను నిర్మించి పిల్లలకు విద్యావకాశం కల్పించారు. అనంతరం పన్నెండేండ్ల క్రితం ప్రాథమికోన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అవడంతో పాటు పక్కా భవనం మంజూరైంది. అయితే, దీనిని నిర్మించేందుకు కూడా స్థలం లేకపోవడంతో బాల్రెడ్డి మనమళ్లు ఎంతో విలువైన మరో రెండెకరాల భూమిని విరాళంగా అందజేశారు. ప్రాథమిక పాఠశాలకు బాల్రెడ్డి స్థలం ఇవ్వగా, ఉన్నత పాఠశాలకు అతడి మనమళ్లు మరికొంత భూమిని విరాళంగా ఇచ్చారు. పాఠశాల భవన ప్రారంభోత్సవ సమయంలో అమ్మన వారి కుటుంబసభ్యులను నాటి సిద్దిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రత్యేకంగా అభినందించారు.
అత్యధిక సంఖ్యలో విద్యార్థులు..
సీఎం కేసీఆర్ ప్రకటించిన ‘మన ఊరు-మన బడి’కార్యక్రమంపై చెల్లాపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక మండలంలో చెల్లాపూర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు అత్యధిక విద్యార్థులు ఉన్న స్కూళ్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ప్రైమరీలో 115 మంది చదువుకుంటుండగా, ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు మరొక విద్యావలంటీర్ను ప్రత్యేకంగా పిల్లల తల్లిదండ్రులు నియమించుకున్నారు. మూడేండ్ల క్రితం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించమంటూ గ్రామస్తులు తీర్మానం చేయగా, స్థానిక బడిలోనే నాణ్యమైన విద్యనందిస్తామని విద్యా కమిటీ తీర్మానం చేసింది. ఇక, ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ఎస్)లో 210 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇందుకోసం 11 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పాఠశాలను సక్సెస్ పాఠశాలగా ప్రకటించగా, ఇక్కడ చదువుతున్న ఆరుగురు విద్యార్థులకు ట్రిఫుల్ ఐటీలో సీటు లభించింది. పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు కూడా ఉన్నారు.
ఆంగ్ల విద్య అందరికీ అవసరం..
ప్రతి విద్యార్థికి ఆంగ్ల విద్య చాలా అవసరం. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు ఆంగ్లంలో బోధన జరిగితే పైతరగతులకు వెళ్లినప్పుడు భాషాపరమైన సమస్యలు ఉండవు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల విద్య అత్యంత ముఖ్యం. సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం తీసుకురావడం హర్షణీయం. విద్యార్థుల్లో ఇంగ్లిష్పై భయాన్ని పోగొట్టి, భాషపై సులభంగా పట్టు పెంచుకునేలా అనేక పద్ధతుల్లో బోధిస్తున్నాను.
-సయ్యద్ ముజీబ్ అలీ, ఇంగ్లీషు ఉపాధ్యాయుడు
భూమిచ్చినందుకు సంతోషంగా ఉంది..
గ్రామంలో బడి లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో స్వయంగా చూశాను. ఉన్నత పాఠశాల లేకపోవడంతో మా నలుగురు పిల్లలు పక్క గ్రామానికి వెళ్లి చదువుకున్నారు. ఇప్పుడు పేద, ధనిక అనే తేడాలేకుండా అందరూ చదువుకునే వీలుండడంతో సంతోషంగా ఉంది. మా మామ బాల్రెడ్డి 60 ఏండ్ల క్రితం ప్రైమరీ పాఠశాలకు ఎకరం స్థలం విరాళంగా ఇచ్చాడు. పన్నెండేండ్ల క్రితం ఉన్నత పాఠశాలకు మేము రెండెకరాల భూమిని ఇచ్చాం. నా కొడుకుల్లో పెద్దోడు శ్రీనివాస్రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. చిన్న కొడుకు రవీందర్రెడ్డి దుబ్బాక (పీఏసీఎస్) వ్యవసాయ పరపతి సహకార సంఘానికి చైర్మన్గా పనిచేశాడు. బడి కోసం స్థలాన్ని ఇచ్చినందుకు ఎప్పుడూ బాధ పడలేదు.
-అమ్మన భారతమ్మ, స్థల దాత
గొప్ప కార్యక్రమం..
మా గ్రామంలో రెండు పాఠశాలలకు కావాల్సిన మూడెకరాల భూమిని అమ్మన బాల్రెడ్డి కుటుంబీకులు విరాళంగా ఇవ్వడం చాలా గొప్ప విషయం. రోడ్డు పక్కనే కోట్ల రూపాయల విలువైన మూడెకరాల స్థలాన్ని ఇవ్వడం మా గ్రామస్తులు వరంగా భావిస్తున్నారు. మా విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లకుండా ‘మన ఊరు-మన బడి’లో చదువుకుంటామనే నినాదంతో ముందుకెళ్తున్నాం. పాఠశాలలో పిల్లలకు మెరుగైన విద్యనందించేందుకు పిల్లల తల్లిదండ్రులు, గ్రామ పెద్దల సహకారంతో అదనంగా విద్యా వలంటీర్ను నియమించుకున్నాం. విద్యాకమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకుని పాఠశాల సమస్యలను పరిష్కరించుకుంటున్నాం.
-కాపరబోయిన శ్రీరాజు, ప్రాథమిక పాఠశాల విద్యాకమిటీ చైర్మన్, చెల్లాపూర్
సర్కారు బడులు బలోపేతం..
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం అభినందనీయం. ఈ కార్యక్రమం గ్రామీణ పేద విద్యార్థులకు వరం. మా ఊరిలో బడి కోసం మా తాత బాల్రెడ్డి స్థలాన్ని ఇచ్చారు. ఉన్నత పాఠశాలకు మా నాన్న తిరుపతిరెడ్డి జ్ఞాపకార్థంగా భూమిని విరాళంగా ఇచ్చాం. మా గ్రామంలోని పేద, మధ్య తరగతి పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉంది. సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయడం శుభపరిణామం.
-అమ్మన రవీందర్రెడ్డి, దుబ్బాక పీఏసీఎస్ మాజీ చైర్మన్, చెల్లాపూర్