వీర బైరాన్పల్లి.. ఆ పేరులోనే వీరత్వం ఉంది. అంతకు మించి ఆ ఊరికి ఒ క చర్రిత ఉంది. పోరాటమంటే ఎట్ల చేయాలి? అన్యాయాలపై ఎలా తిరగబడాలి? అని ఆ ఊరి ప్రజలు ఆనాడే నిరూపించగా, ఆ ఊరు ఎన్నో పోరాటాలకు స్ఫూర్తిని నింపింది. ఆ ఊరే మాతృభూమి విముక్తికి బీజం వేసింది. వీర యోధుల త్యాగాలకు నెత్తుటి సాక్ష్యమే ధూళిమిట్ట మండలంలోని వీర బైరాన్పల్లి. బైరాన్పల్లి నెత్తుటిగాథకు రేపటితో 74ఏండ్లు పూర్తవుతుంది.

మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు 25: మట్టి మనుషుల తిరుగుబాటు.. దోపిడీపై దండయాత్ర.. రజకార్ల మూకలపై నిప్పులయాత్ర.. అగ్నిజ్వాలలై మరిగిన నెత్తుటి మడుగు.. గడ్డికొసిన చేతులే కొడవళ్లు పట్టాయి. బువ్వ వండిన చేతులే బందూక్లు పట్టాయి. రజాకార్ల దుర్నీతికి వ్యతిరేకంగా పిడికిలెత్తాయి. సామాన్యులే సాయుధలై రణనినాదం చేశారు. రైతన్నలే నిప్పుకణికలై విప్లవ శంఖం పూరించారు. వీర యోధుల త్యాగాలకు నెత్తుటి సాక్ష్యమే వీర బైరాన్పల్లి. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి, ప్రజలంతా స్వేచ్ఛ వాయువులు పీల్చుతున్నారు.
నిజాం రాజు ఏలుబడిలో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం స్వేచ్ఛ వాయువులకు నోచుకోకపోవడంతో పాటు రజాకార్ల ఆగడాలకు బలై, బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. గ్రామాల్లో రజాకార్లను ఎదుర్కొనేందుకు ప్రజలు ఎక్కడికక్కడ గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లి పొరుగున ఉన్న లింగాపూర్, ధూళిమిట్ట గ్రామాల మీద పడి రజాకారు మూకలు దోపిడీకి దిగారు. ఆయా గ్రామాల్లో దోచుకున్న సొత్తుతో బైరాన్పల్లి గ్రామం మీదుగా వెళ్తున్న రజాకార్లకు గ్రామ రక్షణ దళ సభ్యులు అడ్డుపడి, సొత్తును స్వాధీన పర్చుకోవడంతో పాటు రజాకార్లకు హెచ్చరికలు జారీ చేశారు.
దీంతో నాటి నుంచి బైరాన్పల్లి గ్రామంపై కక్ష కట్టిన రజాకార్లు, బైరాన్పల్లిపై రెండుసార్లు దాడి చేసి విఫలమయ్యారు. ఈ దాడిలో 20మంది రజాకార్లు చనిపోయారు. దీంతో బైరాన్పల్లి గ్రామాన్ని తిరుగుబాటు గ్రామంగా అప్పటి భువనగిరి డిప్యూటి కలెక్టర్ హాసీం ప్రకటించి, ఏ రోజైనా బైరాన్పల్లిని మట్టుబెడతానని శపథం చేశాడు. గ్రామంపై కక్ష పెంచుకున్న రజాకార్లు, ఏదో ఒక రోజు పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశముందని, గ్రామంలో ఎవరూ ఉండవద్దని గ్రామ రక్షణ దళానికి దళం పంపిన వార్త చేరలేదు. ఎప్పటి లాగే రజాకార్లను ఎదిరిస్తామనే ధీమాతో గ్రామ నడిబొడ్డున ఉన్న బురుజును ప్రధాన రక్షణ కేంద్రంగా మలుచుకున్నారు.
అది 1948 ఆగస్టు 27వ తేదీన సూర్యోదయం వేళ పల్లె నిదుర లేస్తున్నది. అప్పటికే కొన్ని ఇండ్లలో రైతులు మేల్కొని, లేగలను పాల కోసం వదులుతున్నారు. వేకువ జామున 4గంటల ప్రాం తంలో తుపాకీ మోత, తోపుల పేలుళ్లు వినిపిం చాయి. వెనువెంటనే కొన్ని చావు కేకలు.. ఊరంతా ఒక్కసారిగా ఉలికి పడింది. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో గ్రామస్తులు ఆందోళనకు లోనవుతున్నారు. నిజాం సైన్యాధిపతి ఖాసీం రజ్వీ సైనికులు(రజాకార్లు) గతంలో గ్రామంలో తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సుమారు 1200మంది బలగంతో పాటు భారీ మందు గుండు సామగ్రి, తుపాకులు, తోపులతో దొంగచాటున గ్రామంలోకి ప్రవేశించారు.
రజాకార్ల కదలికలను ఎప్పటికప్పుడు గ్రామ రక్షణ దళానికి చేర వేసే గ్రామ కాపరి విశ్వనాథ్భట్జోషి రజాకార్లకు దొరికిపోయాడు. ఉల్లెంగల వెంకటనర్సయ్య అనే గ్రామస్తుడిని రజాకార్లు పట్టుకోగా, అతడు తప్పించుకోని పారిపోయి రజాకార్లు గ్రామంలోకి చొర బడ్డారని పెద్దపెట్టున కేకలు వేశాడు. దీంతో గ్రామంలోని బురుజు మీదనున్న దళ కమాండర్ రాజిరెడ్డి అప్రమత్తమై, ప్రజలంతా తగిన రక్షణలో ఉండేందుకు నగారాను మోగించాడు. ఆ శబ్ధం విన్న బైరాన్పల్లి వీరులు నిద్ర లేచారు. బురుజుపై కాపలాగా ఉన్న మోటం రామయ్య, పోచయ్య, బలిజ భూమయ్య నిద్ర మత్తు వదిలించుకునే లోపుగానే రజాకార్ల తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఫిరంగుల నుంచి వచ్చి పడిన నిప్పు రవ్వలతో బురుజుపైన ఉన్న మందు గుండు సామగ్రి అంటుకుంది. దీంతో బురుజుపై నుంచి ఎదురు కాల్పులు జరపడానికి వీల్లేకుండాపోయింది.

బురుజుకు రక్షణ కరువైంది. గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్లుగా మట్టుపెట్టారు. అంతటితో ఆగకుండా రజాకార్లు ఇంటింటికీ తిరిగి 96మందిని వెతికి పట్టుకొని పెడరెక్కలు విరిచి, జోడుగా లెంకలు కట్టి వరుసగా నిలబెట్టి కాల్చి చంపి, వారి రక్త దాహాన్ని తీర్చుకున్నారు. గ్రామం వెలుపల శవాల చుట్టూ మహిళలను వివస్త్రలుగా చేసి బతుకమ్మ ఆటలను ఆడించారు. రజాకార్ల ఆగడాలను భరించలేక మరికొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. దాడిలో 25మంది రజాకార్లు చనిపోగా, 118మంది గ్రామస్తులు చనిపోయారని రికార్డుల్లో ఉంది. ఆ సంఖ్య 150 పైనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదేవిధంగా రజాకార్లు బైరాన్పల్లితో పాటు కూటిగల్ గ్రామంపై పడి 30 మంది గ్రామస్తులను పొట్టన పెట్టుకున్నారు.
చారిత్రక నేపథ్యం కల్గిన బైరాన్పల్లి గ్రామ అభివృద్ధిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. దీనిలో భాగంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ఐదేండ్ల క్రితం కోటి రూపాయలను ఖర్చు చేసింది. బురుజు వద్ద సీసీ నిర్మాణంతో పాటు గ్రామంలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణాలను చేపట్టింది. గ్రామానికి డబుల్బెడ్రూంలు, విద్యుత్ సబ్స్టేషన్లను మంజూరు చేసింది. అదేవిధంగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామంలో అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించడం ఆనవాయితీగా మారింది.
తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రభాగంలో నిలిచిన బైరాన్పల్లిపై కేంద్ర ప్రభుత్వం వివక్షను కనబర్చుతున్నది. కేంద్రంలో అధికారంలోకి రాగానే బైరాన్పల్లి పోరాటయోధులందరికీ సమరయోధుల పెన్షన్లు మంజూరు చేస్తామని, అదే విధంగా గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది అమరుల త్యాగాలకు గుర్తుగా గ్రామంలో స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని, వివిధ సందర్భాల్లో బీజేపీ అగ్రనేతలు హామీనిచ్చారు.
ప్రధానంగా ప్రస్తుత కేంద్రమంత్రి జీ. కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు, మాజీ ఎంపీలు విజయశాంతి, రాపోలు ఆనందభాస్కర్ తదితర అగ్రనేనేతలు బైరాన్పల్లిని వివిధ సందర్భాల్లో సందర్శించిన సమయంలో బైరాన్పల్లి గ్రామానికి ఎన్నో హామీలను ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు గడుస్తున్న వారి హామీలు ఏ ఒక్కటి కూడా నోచుకోకపోవడంపై గ్రామస్తులు బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పరకాలలో అమరవీరుల స్మృత్యార్థం అమరధామం నిర్మించిన బీజేపీ నాయకులు, బైరాన్పల్లిపై ఎందుకు వివక్ష కనబర్చుతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రధానంగా సమరయోధులకు సంబంధించిన ఫైల్ కేంద్రం ప్రభుత్వం వద్దనే పెండింగ్లో ఉంది. సమరయోధుల పెన్షన్ కోసం ఎదురు చూసి కొంతమంది సమరయోధులు ఇప్పటికే మరణించగా, మరికొంతమంది పెన్షన్ కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. బైరాన్పల్లి సమరయోధులకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని, లేనిపక్షంలో బీజేపీ నాయకులు బైరాన్పల్లిలో అడుగుపెట్టనీమని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
బైరాన్పల్లి పోరాటంపై బీజేపీ నాయకులు మొసలి కన్నీరు కార్చుతున్నారు. సమరయోధులకు పెన్షన్లు, గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకులు వారి హామీలను విస్మరించారు. అమరవీరులకు పిండ ప్రదానం అంటూ బీజేపీ నాయకులు డ్రామాలాడుతున్నారు. అమరవీరుల ఆత్మలు శాంతించా లంటే సమరయోధులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి. అదేవిధంగా గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. బైరాన్పల్లి గ్రామ అభివృద్ధిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సుమారు కోటి రూపాయలతో గ్రామంలో మౌలిక వసతులనుకల్పించింది.
– బర్మ రాజమల్లయ్య, మాజీ సర్పంచ్
రజాకార్ల దాడి సమయంలో నా వయస్సు 20 ఏండ్లు. గ్రామ రక్షక దళం ఆధ్వర్యంలో రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నా. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది. సమరయోధులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి. బైరాన్పల్లి పోరాట చరిత్రను భావితరాలకు తెలియ జేసేందుకు నాటి పోరాట ఘట్టాన్ని పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు గ్రామంలో స్మృతివనాన్ని నిర్మించాలి.
– ఇమ్మడి పెద్ద ఆగంరెడ్డి, స్వాతంత్య్ర సమరయోధుల సంఘం అధ్యక్షుడు
రజాకార్ల దాడిలో ఊరంతా వల్లకాడైంది. రజాకార్లు ఊరు మీదపడి ఇష్టమొచ్చిన రీతిగా దోపిడీ చేశారు. ఆడోళ్లను చిత్రహింసలు పెట్టిండ్రు. ఆడోళ్లను బట్టలిడిపించి బతుకమ్మ ఆడించుండ్రు. ఊరునిండా నెత్తురు డొల్లరింది. ఎటూ చూసినా పీనుగలతో నిండిపోయింది.
-చల్లా చంద్రారెడ్డి, స్వాతంత్య్ర సమరయోధుడు