సదాశివపేట, ఆగస్టు14: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. ఆదివారం మండలంలోని ము బారక్పూర్, సూరారం గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. సూరారంలో రూ.18 లక్షలు, ముబారక్పూర్లో రూ.19 లక్షలతో పంచాయతీ భవనాలు, రూ.20 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించుకున్నట్లు తెలిపారు. నారాయణఖేడ్ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు ప్రతి గ్రామానికి రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు నేడు పల్లెప్రగతితో పరిఢవిల్లుతున్నాయన్నారు.
గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, హరితహారంలో మొక్కలు నాటడం, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, మిషన్ భగీరథ మంచినీరు, పల్లె ప్రగతితో పల్లెలు కొత్త రూపును సంతరించుకున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 36 లక్షల మందికి అన్ని రకాల పింఛన్లు అందుతున్నాయన్నారు. ఈ పంద్రాగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 10 లక్షల మందికి సీఎం కేసీఆర్ పింఛన్లు మంజూరు చేస్తున్నారని గుర్తుచేశారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 42 వేల మందికి పింఛన్లు అందుతాయని, సంగారెడ్డి నియోజకవర్గానికి 7వేలకు పైగా పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ తొంట యాదమ్మ, వైస్ ఎంపీపీ ఫాయిమాబేగం, ఎంపీడీవో పూజ, సూరారం సర్పంచ్ రజియాబేగం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, కార్యదర్శి అరీఫోద్దిన్, ఎంపీటీసీలు మాధవరెడ్డి, సుధాకర్, సంతోష్గౌడ్, సర్పంచ్లు నవీన్, మన్నె శ్రీవాణి దశరథ్, లక్ష్మారెడ్డి, రాములు, శేఖర్, హన్మంత్రెడ్డి, సిద్దన్న, నరేశ్, శేఖర్, నాయకులు పాల్గొన్నారు.