మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 10 : హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న మాసం శ్రావణం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజును పరమ పవిత్రంగా భావిస్తారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం, అనురాగానికి ప్రతిరూపమైన రక్షాబంధన్ను కులమతాలకతీతంగా జరుపుకొంటారు. ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీలు కట్టి, వారి ఆశీర్వాదం పొందడంతో పాటు కానుకులను స్వీకరిస్తారు.
నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష.. మనమిద్దరం దేశానిక రక్ష.. అని ఒకరికొకరు చెప్పుకుంటూ అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు రక్ష కట్టుకునే పండుగే రాఖీ పౌర్ణమి. ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమినే రాఖీ పండుగగా జరుపుకొంటారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీని భావిస్తారు. మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ రాఖీ పండుగను జరుపుకొని అందులోని ముఖ్య ఉద్దేశాన్ని ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇలా మొదలైంది..
పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం (12 సంవత్సరాలు) యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవేంద్రుడు ఓటమి పాలై పరివారంతో కలిసి అమరావతిలో తలదాచుకుంటాడు. విజేతలైన రాక్షసులు అమరావతిని కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో ఇంద్రుడి భార్య శచీదేవి భర్తలో సమరోత్సహం నింపుతున్నది. ఆ రోజు శ్రావణ పౌర్ణిమి కావడంతో పార్వతీ పరమేశ్వర్లు, లక్ష్మీనారణులను పూజించి వారి ప్రసాదంగా రక్షను ఇంద్రుడి చేతికి కడుతున్నది. అలాగే, దేవతలు అందరూ శివకేశవులను పూజించిన ఇంద్రుడికి రక్షలు కట్టి అండగా నిలబడుతారు.
ఆ తర్వాత జరిగిన యుద్ధంలో దేవేంద్రుడు విజయం సాధించి త్రిలోకాధిపతాన్ని పొందుతాడు. ఆనాడు శచీదేవి ప్రారంభించిన రక్షాబందోనోత్సమే కాలక్రమంలో రాఖీ పండుగా అయింది.మరో కథ సైతం చరిత్రలో ఉంది. భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తున్న రోజుల్లో మొగలాయిల దుర్నీతికి, దురగతాలకు అంతు లేకుండా పోయింది. హిందూ మహిళలు మాన, ప్రాణ రక్షణ కోసం వీరులైన యోధులను గుర్తించి వారికి రాఖీలు కట్టి సోదరభావంతో రక్షణ పొందేవారు. ఆ రోజుల్లోనే ఒకసారి రాణీ కర్ణావతి శత్రువులు తన దుర్గాన్ని ముట్టడించినపుడు ఢిల్లీ పాదుషాకు రాఖీ పంపగా, ఆయన ఆమెను సోదరిగా భావించి శత్రువులను తరిమికొట్టడమే కాక ఆ సోదరి ఇంట భోజనం చేసి కానుకలు సమర్పించారని చరిత్ర చెబుతున్నది.
ఆన్లైన్లో రక్షా బంధనం..
కాలం మారడంతో పాటు రక్షాబంధనం తీరు మారింది, విద్య, ఉపాధి, ఇతరాత్ర కారణాలతో దూర ప్రాంతాల్లో ఉంటున్న సోదరులరు పోస్టు ద్వారా రాఖీలను పంపితే కట్టుకొని తోబుట్టువులకు కానుకలు పంపుతుండడం నేటికీ సంప్రదాయంగా కొనసాగుతున్నది. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతం కావడంతో ఆన్లైన్ ద్వారా రాఖీలను పంపి ఆన్లైన్ ద్వారా పరస్పరం అభిందనలు తెలుపుకోవడం దూర ప్రాంతాల్లో గలవారికి వెసులుబాటుగా మారింది. పద్ధతులు మారినా రాఖీలో అనుబంధం, ఆప్యాయత మాత్రం చెక్కు చెదరలేదు.
రాఖీ పవిత్రత..
భార్యాభర్త, సోదరీ సోదరులకు రాఖీ కట్టడం ద్వారా వారు తలపెట్టే కార్యాలు విజయవంతమై సుఖసంపదలు కలుగాలని ఆకాంక్షిస్తారు. అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు, నూతన వస్ర్తాలు, చిరుకానుకలు సమర్పించి భార్యలు, సోదరీమణులను సంతుష్టులను చేస్తారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకుని విందు భోజనం చేస్తారు.
జంధ్యాల పండుగ..
శ్రావణ పౌర్ణమి పర్వదినం సందర్భంగా బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. విద్యార్థులు వేద పఠనాన్ని ప్రారంభిస్తారు, బ్రాహ్మణ సంఘాలు ఈ రోజుల ఉచితంగా జంధ్యాల మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. భారతీయ సంస్కృతికి అద్దం పట్టే శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్, జంధ్యాల మార్పిడితో మన సంప్రదాయాలను కాపాడుకుందాం.