మెదక్/మెదక్ రూరల్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చే సమస్యలు, వినతులు స్వీకరించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 22 ఫిర్యాదులు రాగా, అందులో 17 రెవెన్యూ సంబంధించినవి కాగా, మరో ఐదు ఇతర సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ మేరకు ఆయా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి కృష్ణమూర్తి, డీఎస్వో శ్రీనివాస్, డీఈవో రమేశ్ కుమార్, ఆర్డీవో సాయిరాం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కరించేందుకే..
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణిని నిర్వహిస్తునట్లు మెదక్ అదనపు ఎస్పీ డాక్టర్ బాలస్వామి పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశానుసారం మెదక్ అదనపు ఎస్పీ ప్రజావాణి నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట గ్రామానికి చెందిన మహేశ్కి కౌడిపల్లి మండలం తిమ్మపూర్లో భూమి ఉందని అట్టి భూమి కబ్బా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేయగా, ఫిర్యాదుదారుడికి తగిన న్యాయం చేయాలని నర్సాపూర్ సీఐకి సూచించారు. టెక్మాల్ మండలం కమర్కత్త గ్రామానికి చెందిన నారాయణ తన కూతురుకి 8 ఏండ్ల కింద వివాహం చేశానని ఇప్పుడు అత్తింటి నుంచి వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశాడు.