నర్సాపూర్, ఆగస్ట్8: పట్టణంలోని థియేటర్లలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు ఆర్డీవో వెంకట ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నర్సాపూర్లోని పలు థియేటర్లను ఆయన పరిశీలించారు. వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్డీవోతో పాటు మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి, ఎంపీడీవో మార్టీన్ లూథర్, ఎంఈవో బుచ్చానాయక్, ఏంపీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
పెద్దశంకరంపేటలో..
పెద్దశంకరంపేట, ఆగస్టు8: వజ్రోత్సవాల సందర్భంగా ప్రతీ ఇంటికి జాతీయ జెండాను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెద్దశంకరంపేట మండలానికి మొదటి విడతలో సుమారు ఐదు వేల జెండాలు చేరుకున్నాయి. వీటిని ఆయా గ్రామాలకు సీనియర్ అసిస్టెంట్ కాశీరాం కార్యదర్శులకు అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికీ అందజేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు అజ్మత్, పాషా, నర్సింహులు ఉన్నారు.
విద్యార్థుల ర్యాలీ
తూప్రాన్, ఆగస్టు8:తూప్రాన్లోని వికాస్ హైస్కూల్ విద్యార్థులు ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగరేద్దాం, స్వాతంత్య్ర భారత కీర్తిని దశదిశలా చాటుదాం అంటూ నినదిస్తూ, మువ్వన్నెల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి నర్సాపూర్ చౌరస్తా వరకు కొనసాగింది. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీధర్, ప్రిన్సిపాల్ సరిత పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు కళాశాలలు ముస్తాబు
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు8: జిల్లా కేంద్రంలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాల వజ్రోత్సవాలకు ముస్తాబైంది. విద్యార్థినులు కళాశాలకు మామిడి తోరణాలు, రంగురంగు పూలతో, రంగవల్లికలతో అందంగా తీర్చిదిద్దారు. కార్యక్రమాల్లో భాగంగా ప్రతి రోజు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ వాసంతి పిైళ్లె తెలిపారు.
ఫ్రీడం పార్కుకు ఏర్పాట్లు పూర్తి
నిజాంపేట, ఆగస్టు8: మండలంలోని నందిగామలో ఒక ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న ఫ్రీడం పార్కును పంచాయతీ పాలక వర్గం సభ్యులు పరిశీలించారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఈ పార్కు ఏర్పాటు చేస్తున్నామని, 75 ఆకారం వచ్చేలా మొక్కలు నాటేందుకు మార్కింగ్ చేశామని సర్పంచ్ ప్రీతి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సురేశ్, పంచాయతీ కార్యదర్శి ఆరిఫ్ హూస్సేన్, ఉప సర్పంచ్ గెల్లు రాజం, వార్డు సభ్యులు ఉపాధ్యాయలు పాల్గొన్నారు.