మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు8: విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం ధారాదత్తం చేసేందుకు పార్లమెంట్లో విద్యుత్ సవరణ చట్టం-2022ను బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘాల ఐక్యచరణ సమితి విమర్శించింది. ఈ బిల్లును నిరసిస్తూ సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, సిబ్బంది విధులు బహిష్కరించారు. నల్ల బ్యాడ్జిలు ధరించి ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 15 లక్షల ఉద్యోగుల జీవితాలను కాలరాసి, బిల్లును ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఈ బిల్లును కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మహాధర్నాలో ట్రాన్స్కో ఎస్ఈ జానకిరాములు, ఏడీఈ మోహన్బాబు, 1104 యూనియన్ సర్కిల్ అధ్యక్షుడు ప్రసాద్, 327 సర్కిల్ అధ్యక్షుడు వెంకటేశం, పరమేశ్వరప్ప, రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ డివిజన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, అశోక్, నాగరాజు పాల్గొన్నారు.
కాంగ్రెస ఆధ్వర్యంలో..
ప్రైవేట్ వ్యక్తులు విద్యుత్ అమ్మడానికి చట్ట సవరణ బిల్లుతో తీరని నష్టం వాటిల్లుతుందని మెదక్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ సవరణ బిల్లును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అనేక సవరణలు చేసి దేశాన్ని కొంతమంది వ్యాపారులకు ధారాదత్తం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికే దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, విమానయానం, బ్యాంకింగ్ వ్యవస్థ, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్తో పాటు అనేక సంస్థలను అదానీ, అంబానీ లాంటి వ్యాపారులకు అప్పగించిందన్నారు. ఆయనతో మున్సిపల్ కౌన్సిలర్ లింగం, నాయకులు మహేందర్రెడ్డి, నర్సింలు, శ్యాంసుందర్ ఉన్నారు.
రామాయంపేట విద్యుత్ సబ్డివిజన్ ఎదుట నిరసన
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులపై కక్షగట్టి ప్రైవేటీకరణకు మొగ్గు చూపడం తగదని, వెంటనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మానుకోవాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. రామాయంపేట విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట సబ్ డివిజన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పంబాల శ్రీనువాస్ ఆధ్వర్యంలో చేగుంట, నిజాంపేట, నార్సింగి మండలాలకు చెందిన ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగానికి చెందిన విద్యుత్ సంస్థను నిర్వీర్యం చేయవద్దని, ప్రైవేటు రంగ సంస్థల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను నిలిపేయకుంటే నిరంతరం నిరసనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సుమంత్, రాములు, టంకరి స్వామి, మద్దూరి రాజు, సంజీవయ్య, శ్రీశైలం, మునిరావు, బాలయ్య, మహేందర్, కిషన్, శ్రీలేఖ, రాణి ఉన్నారు.
తూప్రాన్లో..
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తూప్రాన్ డివిజన్ విద్యుత్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు విధులు బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా తూప్రాన్ డీఈ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో తూప్రాన్ విద్యుత్ డివిజన్ ఇంజినీర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.