ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ టీఆర్ఎస్, మాకు ప్రజలే అధిష్టానమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ ఓటరు నమోదులో మార్పులు చేసిందని తెలిపారు. మెదక్వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైలు ప్రయాణం త్వరలోనే అందుబాటులోకి రానున్నదని, సోమవారం రైల్వేస్టేషన్లో రేక్ పాయింట్ను ప్రారంభిస్తున్నందున ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మెదక్లో 900 డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయ్యాయని, వాటిని త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. అర్హులైన దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పింఛన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మనఊరు – మనబడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఇంజినే నడుస్తదని, మోదీ డబుల్ ఇంజిన్ నడవదని అన్నారు.
మెదక్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే అధిష్టానమని, ప్రజల కోసం పనిచేసే పార్టీ టీఆర్ఎస్ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ద్వారకా గార్డెన్స్లో మెదక్ నియోజకవర్గ టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ నిబంధనలు మార్చిందని ఆమె తెలిపారు. ఓటరుకు ఆధార్ను లింక్ చేస్తున్నారని, ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఎన్నికల కమిషన్ పకడ్బందీగా వ్యవహరిస్తున్నదన్నారు. రెండు చోట్ల ఓట్లు ఉంటే తొలిగించి ఒకే చోట ఉండేలా చూడాలని తెలిపారు. గ్రామాల్లో బీఎల్వోలను నియమించాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతున్నదని తెలిపారు. 17 ఏండ్లు నిండిన వారు ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు.
మోదీ డబుల్ ఇంజిన్ తెలంగాణలో నడవదు..
తెలంగాణకు కేంద్రం సహాయం చేయడం లేదని, కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఇంజిన్ నడుస్తున్నదని, మోదీ డబుల్ ఇంజిన్ తెలంగాణలో నడవదని బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన బీజేపీ సభలో ప్రధానమంత్రి మోదీ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మెదక్ ఎంపీపీ యమునాజయరాంరెడ్డి, హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మెదక్ నియోజకవర్గంలోని ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, రాజు, మహేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చిల్ముల హన్మంతరెడ్డి, ఏడుపాయల దేవస్థాన కమిటీ చైర్మన్ బాలాగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఆగస్టు 1న మెదక్లో రేక్ పాయింట్ ప్రారంభం..
ఆగస్టు 1న మెదక్కు రైలు రాబోతున్నదని, ఇందిరాగాంధీ మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించినా మెదక్కు రైలు రాలేదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేశారని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చించి రైల్వే లైన్ను పూర్తి చేయించారని తెలిపారు. మెదక్ రైల్వే స్టేషన్లో రేక్ పాయింట్ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్, అందుకు సహకరించిన మంత్రి హరీశ్రావులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రేక్ పాయింట్ ప్రారంభోత్సవానికి జిల్లా నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలించేందుకు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మెదక్ జిల్లాలో త్వరలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెదక్లో ఇప్పటికే 900 ఇండ్లు పూర్తయ్యాయని, త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. సొంత స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల సాయం అందజేస్తామని తెలిపారు. అర్హులైన వారికి పెన్షన్లు అందజేస్తామని, దివ్యాంగులు, వితంతువులు, ఒం టరి మహిళలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. గిరిజన పంచాయతీలకు వెయ్యి గజాల స్థలం ఉంటే రూ.25 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం నిర్మిస్తామన్నారు. ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం కింద పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. మెదక్ నియోజకవర్గంలోని మండలాల్లో పాఠశాలలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రూ.26 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.