– సంగారెడ్డి కలెక్టర్ శరత్
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 30: ఓటరు జాబితాను ఆధార్తో అనుసంధానం చేయాలని రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టంచేశారు. శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి సూచనల మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లందరూ గరుడ యాప్లో తమ ఎన్నికల గుర్తింపును నమోదు చేసుకోవాలన్నారు. ఇందులో స్వచ్ఛందంగా ఆధార్కార్డు నంబరు నమోదు చేయాలన్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్లను నియామకం చేసుకుని సంబంధిత అధికారికి సహకరించాలని కోరారు. అంతకుముందు ఫారం 6, 6బీ, 7, 8లపై ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్వో రాధికారమణి, ఆర్డీవో నగేశ్, ఎన్నికల పర్యవేక్షకుడు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.