సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ.. తన రచనలతో తెలంగాణ అస్తిత్వపు భావాజాలాన్ని నలుదిశలా చాటిన సాహితీ యోధుడు, మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతిని పురస్కరించుకొని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచే ‘నమస్తేతెలంగాణ’ ఆధ్వర్యంలో ‘నా తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. సాహితీ సప్తాహం’ కార్యక్రమాన్ని శుక్రవారం రవీంద్రభారతిలోని మినీహాల్లో ఘనంగా నిర్వహించారు. కవిత-పద్యం, పాటల పోటీల విజేతలకు నగదు పురస్కారంతో పాటు బహుమతులు అందజేశారు. ఎనిమిదేండ్ల రాష్ట్ర ప్రగతిని విశ్లేషిస్తూ..ముఖ్యఅతిథులు, రచయితలు, కవులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ‘నమస్తే తెలంగాణ’ డిప్యూటీ ఎడిటర్ పరాంకుశం వేణుగోపాలస్వామి, ఎడిట్ పేజీ డెస్క్ ఇన్చార్జి కేవీ రవికుమార్, ఎడిట్ పేజీ చీఫ్ సబ్ ఎడిటర్ ఎస్.మల్లారెడ్డి, హైదరాబాద్ ఎడిషన్ ఇన్చార్జి చిరంజీవి ప్రసాదరావు, సర్క్యూలేషన్ మేనేజర్ గణేశ్,సబ్ ఎడిటర్ గడ్డం సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
చీకటిలో ఉన్నవారే ..
చీకటిలో ఉన్నవారే అఖండ దీపాన్ని కాంక్షిస్తారు. ప్రకృతి-పంచభూతాల జగత్తులో ప్రామాణికం, పారదర్శకతను పాటించి రచనలు చేసిన వారే ప్రఖ్యాత రచయితలుగా నిలుస్తారు. కవి అంటే సామాజిక చైతన్యంతో పాటు తన పాత్రను అందివ్వాలి. అంతిమంగా మానవత్వాన్ని ప్రదర్శించేదే మంచి కవిత్వం. శ్రీకృష్ణదేవరాయలు రాసిన అముక్త మాల్యద నన్ను ప్రభావితం చేసింది. ‘వీచే గాలి, మోసే నేల, పొంగే గంగ, పొద్దు, నింగి’ ఈ ఐదింటి రూపమైన ప్రకృతి జగత్తులో కవిత్వం ఎంతో ప్రభావం చూపుతుంది.
– గోరేటి వెంకన్న,ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ
కేసీఆర్ సాహిత్యాభిమాని..
గతంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయా ప్రాంగణాలకు తెలంగాణ ప్రాంత కవులు, రచయితల పేర్లను పెట్టి సీఎం కేసీఆర్ తన సాహిత్యాభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ మాండలికం, ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని కొనసాగిస్తున్నది ‘నమస్తే తెలంగాణ’. దాశరథి జయంతి సందర్భంగా ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయం.
– మామిడి హరికృష్ణ, తెలంగాణ భాషా,సాంస్కృతిక శాఖ సంచాలకుడు
కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం
గోదావరిపై కాటన్ ధవళేశ్వరాన్ని కట్టిస్తే.. అదే గోదారమ్మపై కాళేశ్వరాన్ని కట్టించి తెలంగాణను సస్యశ్యామలం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. కవులు, రచయితలను గౌరవించడంలో శ్రీకృష్ణదేవరాయలను తలపిస్తున్నారు.
– తిగుళ్ల కృష్ణమూర్తి, నమస్తే తెలంగాణ ఎడిటర్
సమాజాన్ని విడదీసే వారికి తెలంగాణ గడ్డపై స్థానం లేదు..
కుల, మత ఆధిపత్యానికి చరమగీతం పాడాల్సి వస్తే.. కవులు, రచయితలే తమ కలాలతో శంఖారావం పూరిస్తారు. మతం, కులం పేరుతో సమాజాన్ని విడదీసే వారికి తెలంగాణ ఉద్యమ గడ్డపై స్థానం లేదు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో కవులు, రచయితలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ప్రసిద్ధికెక్కింది. ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో సాహిత్యకారులను ప్రోత్సహించేందుకు చొరవ తీసుకోవడం గొప్ప విషయం. కవులు, రచయితలను ముందుండి నడిపిస్తున్న ఒకే ఒక్క పత్రిక ‘నమస్తే తెలంగాణ’.
– జూలూరు గౌరీశంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు
దాశరథిలాగానే కేసీఆర్ ఆరాటపడుతున్నారు..
నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ..రైతుల కోసం ఆనాడు దాశరథి కృష్ణమాచార్య ఎలాగైతే ఆరాటపడ్డారో.. సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు రైతుల కోసమే తపనపడుతున్నారు. రైతు బీమా, రైతు బంధు తదితర అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలిచారు. చిన్నప్పటి నుంచే కేసీఆర్ పుస్తకాలను విరివిగా చదివేవారు. ఆయన గురువు వీరభద్రారెడ్డి నా క్లాస్మేట్. విద్యార్థిగా ఉన్నప్పుడు కేసీఆర్ అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడం ఒక్కోసారి సాధ్యం కాలేదని చెబుతుండేవారు. పద్యం విన్న వెంటనే తిరిగి అప్పజెప్పే తెలివి ఉన్నవారు. ఓ సారి అష్టావధానం కార్యక్రమంలో అవధాని చదివిన పద్యాన్ని వెంటనే తిరిగి అప్పజెప్పారు. అక్కడున్న వారంతా కేసీఆర్ తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. దాశరథి జయంతిని పురస్కరించుకొని ‘నమస్తే తెలంగాణ’ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయం. తెలంగాణలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన పత్రిక ఏదీ లేదు. ఒక్క ‘నమస్తే తెలంగాణ’ తప్ప. గతంలో గోల్కొండ పత్రిక ఉండేది. అది ఇప్పుడు లేదు. మారుమూల పల్లెల్లో కూడా ‘నమస్తే తెలంగాణ’ను చదువుతున్నారు. తెలంగాణ భాష, యాసకు ప్రాధాన్యతనిస్తూ అందరి మన్ననలు పొందుతున్నది.
కేసీఆర్ కీర్తి వెలుగుతూనే ఉంటుంది..
14 ఏండ్లుగా బాపు కేసీఆర్ నాయకత్వంలో తన భవిష్యత్ను కలగన్నది మన తెలంగాణ. వంశాల వారీగా విధ్వంసమైన ఒక్కొక్క వ్యవస్థ పునర్నిర్మాణమే లక్ష్యంగా రాష్ర్టాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. తెలంగాణలో ఏ పల్లెను చూసినా.. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. సూర్యాచంద్రులు ఉన్నంత వరకూ బాపు కేసీఆర్ కీర్తి నలుదిశలా వ్యాపిస్తుంది.
– మంత్రి శ్రీదేవి, అధికార భాషా సంఘం అధ్యక్షురాలు
ఇప్పటి వరకు ఏపత్రికలు సన్మానించిన దాఖలాలు లేవు
పద్య విభాగంలో ప్రథమ బహుమతి అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే ఈరోజు కవులు, రచయితలు ఆత్మగౌరవంతో బతకగలుగుతున్నారు. ‘నమస్తే తెలంగాణ’ కవిత్వం, పద్యం, పాటల విభాగాల్లో పోటీలు నిర్వహించడం గొప్ప విషయం. గతంలో ఏ పత్రిక కూడా కవులను, రచయితలను సన్మానించిన దాఖలాలు లేవు. మమ్మల్ని ప్రోత్సహించిన ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు.
-బండకాడి అంజయ్య, ప్రథమ బహుమతి విజేత (సిద్దిపేట)
పుస్తక పఠనం కీలకం
సాహిత్యంపై డిజిటలైజేషన్ ప్రభావం కథలు, కవిత్వాలు, రచనలు ఈ తరం వారికి ఆడియోరూపంలో కూడా అందుబాటులోకి వచ్చాయి. కవిత్వం రాయడానికి పుస్తక పఠనం అనేది కీలకం. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. పిల్లలు పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సాహితీ సప్తాహం కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయం.
– చిరంజీవులు, వైస్ ప్రెసిడెంట్ (నమస్తేతెలంగాణ)