నారాయణరావుపేట, జూలై 5 : ఇబ్రహీంపూర్ గ్రామం చాలా బాగుందని, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ శిక్షణ అధికారులు కొనియాడారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏడు రోజుల శిక్షణలో భాగంగా ఆ సంస్థ డైరెక్టర్ జనరల్, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి హరిప్రీత్సింగ్ ఆదేశాల మేరకు మంగళవారం నాగాలాండ్కు చెందిన 17మంది సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం, కోర్సు డైరెక్టర్లు మాధవి, శ్రీనివాస్ నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ను సందర్శించారు. గ్రామంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. స్వచ్ఛ విద్యాలయ అవార్డు అందుకున్న ప్రాథమిక పాఠశాల, ఇంకుడుగుంతలు, ఓపెన్ జిమ్, గొర్రెల షెడ్లు, వైకుంఠధామం, పశువుల హాస్టల్, డంపింగ్ యార్డులో ఎరువుల తయారీ విధానం, పార్కు, పంచాయతీ భవనాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ బృందం అధికారులు మాట్లాడారు. శిక్షణలో భాగంగా గ్రామానికి వచ్చినట్లు చెప్పారు. ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు సందర్శించామని, ఈ గ్రామం దేశానికే మోడల్ గ్రామంగా అద్భుతంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రవేశపెట్టిన నూతన ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నాయన్నారు. తమ రాష్ట్రంలో కూడా ఇక్కడి ప్రభుత్వ పథకాలు, విధానాల గురించి ప్రభుత్వానికి, ప్రజల్లోకి తీసుకెళ్తామని, ముఖ్యంగా గొర్రెల షెడ్, డంపుషెడ్, ఇంకుడు గుంతలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయని తెలిపారు. వారి వెంట మానవ వనరుల అభివృద్ధి సంస్థ కోఆర్టినేటర్ శ్రీనివాస్, ఆర్డీవో అనంతరెడ్డి, ఎంపీడీవోలు సమ్మిరెడ్డి, మురళీధర్శర్మ, ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, ఎంపీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, సర్పంచ్ దేవయ్య, నాయకుడు ఎల్లారెడ్డి, నగేశ్ ఉన్నారు.
గజ్వేల్, జూలై 5 : మిషన్ భగీరథ పథకం బాగుందని, భవిష్యత్లో మా ప్రాంతంలోనూ ఇలాంటి ప్రాజెక్టును అమలు చేస్తామని నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం పేర్కొంది. గజ్వేల్ మండలం కోమటిబండలోని మిషన్ భగీరథ సంప్హౌస్ను వారు సందర్శించారు. మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ విజయ్ప్రకాశ్, ఈఈ రాజయ్య, డీఈఈ నాగార్జునరావు, ఇతర అధికారులు మిషన్ భగీరథ పథకం, ఉద్దేశం, నీటి సేకరణ, నీటి శుద్ధీకరణ, ఇంటింటికీ సరఫరా తదితర అంశాల గురించి చెప్పారు. ప్రాజెక్టు గురించి తెలుసుకున్న నాగాలాండ్ అధికారుల బృందం ఆనందానికి, ఆశ్చర్యానికి గురయ్యారు. తమకు పథకం గురించి వివరించిన ఈఎన్సీ, ఈఈ, డీఈఈలకు వారు కృతజ్ఞతలు తెలుపుతూ జ్ఞాపికలను బహూకరించారు. ఈ సందర్భంగా నాగాలాండ్ అధికారులు మాట్లాడుతూ మిషన్ భగీరథప్రాజెక్టు చాలా అద్భుతంగా ఉందన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం, అధికారులు కృషి చేసిన విధానాన్ని ఈ ప్రాజెక్టును చూసి తెలుసుకోవచ్చన్నారు.