గజ్వేల్, జూలై 5: నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఆగస్టు15లోగా పంపిణీకి సిద్ధం చేయాల్సిందిగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ డబుల్బెడ్ రూం ఇండ్లను మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, అధికారులతో కలిసి ఆయన పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సంగాపూర్లో పట్టణ పేదల కోసం 1250 ఇండ్లు నిర్మించడం జరిగిందని, వీటిలోని 1100 ఇండ్లల్లో మల్లన్నసాగర్ భూనిర్వాసితులు ప్రస్తుతం నివసిస్తున్నారని, 56 ఇండ్లను రోడ్డు అభివృద్ధిలో ఇండ్లు కోల్పోయిన వారికి కేటాయించినట్లు గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించిన అనంతరం కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి నియోజకవర్గవ్యాప్తంగా పూర్తయిన, నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులకు ప్లాట్లు అందిస్తే సంగాపూర్లోని డబుల్ బెడ్రూం ఇండ్లు ఖాళీ చేస్తారని, వెంటనే ప్లాట్లలో మౌలిక వసతులు పూర్తి చేసి వారికి అందజేయాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నియోజకవర్గవ్యాప్తంగా గ్రామాలకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఏ దశలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలు పూర్తయి చిన్నపాటి పనులు మిగిలిన వాటిని తొందరగా పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు.నిర్మాణంలో ఉన్న డబుల్బెడ్రూం ఇండ్లను ఆగస్టు30వ తేదీనాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికకు ఎలాంటి సమస్యలు లేకుండా పటిష్టంగా నిర్వహించాలని ఆర్డీవో విజయేందర్రెడ్డి, తహసీల్దార్ అబ్రహాన్ని ఆదేశించారు. ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ..ఆయా గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లులను తొందరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.