మెదక్ రూరల్, జూలై 5 : మహిళలు చదువుకోవాలని, వారి విద్యావ్యాప్తికి కృషిచేసిన మహనీయుడు జ్యోతిబాఫూలే అని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ధ్యాన్చంద్ చౌరస్తాలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, విగ్రహదాత తాళ్లపల్లి రాజశేఖర్తో కలిసి ఫూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో నెలకొన్న రుగ్మతలను రూపుమాపి మహిళల అభివృద్ధి కోసం పోరాటం చేసిన మహనీయుడు ఫూలే అన్నారు. అంటరానితం వంటి దురాచారాలను అరికట్టేందుకు పోరాటం చేసిన తొలి సామాజిక విప్లవకారుడు ఫూలే అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో 46 గురుకుల పాఠశాలలను స్థాపించిందన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నారన్నారు. ఇంటర్, పదో తరగతి ఫలితాల్లో గురుకులాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని గుర్తుచేశారు. అంతకుముందు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మాట్లాడుతూ 195 ఏండ్ల క్రితమే బడుగు బలహీన వర్గాలను ఏకతాటిపై తీసుకువచ్చిన వ్యక్తి ఫూలే అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బీసీల సం క్షేమానికి కృషి చేశారన్నారు. బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ఇటీవల రాజ్యసభకు ఎన్నికైనందుకు ఎమ్మెల్సీ శేరి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పండరీగౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగరాం, మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్. ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.