మెదక్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : ఇందిరాగాంధీ కాలం నుంచి మెదక్ ప్రజల రైల్వేలైన్ కోరిక రాష్ట్ర ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వడంతో నెరవేరిందని డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్ చంద్రయాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎగుమతులు, దిగుమతులతోనే ఏ ప్రాంతమైన శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అక్కన్నపేట నుంచి మెదక్ వరకు నిర్మించిన రైల్వే ట్రాక్తో రైస్ బౌల్గా పిలువబడే మెదక్ జిల్లా భవిష్యత్లో వ్యాపారపరంగా రూపురేఖలే మారుతాయని పేర్కొన్నారు.
జిల్లా నుంచి ఏటా 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం చర్లపల్లి, సనత్నగర్కు తరలించడంతో వ్యయప్రయాసాలకొర్చేవారని, కానీ నేడు ర్యాక్ పాయింట్ ఏర్పాటుతో రైస్ మిల్లర్లకు, ఎరువులు, రసాయనాలు, స్టీల్, సిమెంట్ ఇండస్ట్రీల వారికి, పత్తి, ఎగుమతి వారికి ఎంతో అనుకూలమన్నారు. త్వరలో ర్యాక్ పాయింట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, తద్వారా లోడింగ్, అన్ లోడింగ్ వారికి కూడా ఉపాధి లభిస్తుందని తెలిపారు. స్టాక్ నిల్వకు సమీపంలో గోదాములుంటే సైడింగ్ ట్రాక్తో సమయం ఆదా అవుతుందన్నారు. అనంతరం మెదక్ కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ దశాబ్దాల మెదక్ జిల్లా వాసుల కల నెరవేరిందన్నారు. రైల్వే ట్రాక్ నిర్మాణంతో ప్రయాణ సౌకర్యంతో పాటు సరుకు రవాణాకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.
గోదాముల నిర్మాణానికి సుమారు 30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించామని, వీటి నిర్మాణానికి పౌర సరఫరాల శాఖకు అందజేస్తామన్నారు. తద్వారా రైస్ మిల్లర్లకు, రైతులకు పారిశ్రామిక వేత్తలకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. సమావేశంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జిల్లా రైస్ మిల్లుల సంఘం అధ్యక్షుడు చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, డీఎస్వో శ్రీనివాస్, రైస్ మిల్లర్లు, సిమెంట్, స్టీల్ డీలర్లు పాల్గొన్నారు.